మోడీ మంచోడు.. కాదు చెడ్డోడు.. పెళ్లి క్యాన్సిల్‌

కొన్ని పెళ్లిల్లు చిత్ర విచిత్రమైన కారణాలతో ఆగిపోవడం మనం ఇప్పటి వరకు చూశాం. అయితే తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ వల్ల ఉత్తరప్రదేశ్‌లో పెళ్లి ఆగిపోయింది. కాబోయే పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు మద్య మోడీ గురించిన చర్చ జరిగింది. ఆ చర్చ కాస్త శృతిమించడంతో పెళ్లి క్యాన్సిల్‌ అయ్యింది. మోడీ గురించి ఇద్దరు భిన్న అభిప్రాయాలను కలిగి ఉన్నారు. దాంతో విరుద్ద అభిప్రాయాలు కలిగి ఉన్న తాము పెళ్లి చేసుకోవడం ఎంత మాత్రం మంచిది కాదని పెద్దలను ఒప్పించి, నొప్పించి పెళ్లిని క్యాన్సిల్‌ చేసుకోవడం జరిగింది.

వివరాల్లోకి వెళ్లే.. ఉత్తర ప్రదేశ్‌లోని లక్నోలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న అమ్మాయికి, కాన్పూర్‌లో చిన్న వ్యాపారం చేస్తున్న అబ్బాయికి కుటుంబ సభ్యులు వివాహం నిశ్చయించారు. ఇద్దరు ఒకరిని ఒకరు మెచ్చుకున్నారు. ఇద్దరి అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఒక గుడి వద్ద కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరు ముందుగా అనుకున్నట్లుగా గుడికి వెళ్లారు. గుడికి వెళ్లి అక్కడ దర్శణం చేసుకుని కూర్చుని మాట్లాడుకోవడం ప్రారంభించారు. ఆ సమయంలో వారిద్దరి మద్య అనేక అంశాలు ప్రస్థావనకు వచ్చాయి. ఆ సమయంలోనే ప్రధాని మోడీ విషయమై చర్చ జరిగింది.

ఆ చర్చలు ఒకరు మోడీ మంచివాడు, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయంటూ చెప్పగా మరొకరు మాత్రం దేశం మోడీ వల్ల 50 సంవత్సరాలు వెనక్కు పోతుంది అంటూ వాదించారట. ఇలా ఇద్దరు వాదించుకోవడం, అది కాస్త తీవ్ర రూపం దాల్చడం, వ్యక్తిగత దూషణలు కూడా చేసుకోవడం వరకు వెళ్లిందట. దాంతో ఇద్దరు కూడా పెళ్లి పీఠలు ఎక్కాలనుకునే నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. ఆ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పగా ఒప్పించేందుకు వారు తీవ్రంగా ప్రయత్నం చేసి చివరకు పెళ్లిని క్యాన్సిల్‌ చేసుకోవడం జరిగింది. ఈ విషయం మోడీకి తెలిస్తే తనకు మద్దతుగా మాట్లాడి పెళ్లిని క్యాన్సిల్‌ చేసుకున్న వారి పట్ల ఎలా స్పందిస్తాడో అని సోషల్‌ మీడియాలో జోకులు పేళుతున్నాయి.