దక్షిణాఫ్రికాపై కసి తీరా ప్రతీకారం తీర్చుకుంది టీమిండియా. టెస్ట్ పరజాయం చూసిన భారత్.. వన్డేలో వీర విహారం చేసింది. ఆరు వన్డేలో ఐదు వన్డేలు గెలిచి తిరుగులేని విజయాన్ని అందుకుంది. నిన్న జరిగిన చివరి వన్డేలో భారత్ భారీ విజయాన్ని అందుకుంది.
అప్పటికే సిరీస్ సొంతమైనా గెలుపే లక్ష్యమన్న విరాట్ కోహ్లీ చెప్పింది చేసి చూపించాడు. శార్దూల్ ఠాకూర్తో పాటు బౌలర్లు ప్రత్యర్థిని తక్కువ స్కోరుకు కట్టడి చేయగా.. తర్వాత కోహ్లీ (129 నాటౌట్) మెరుపు సెంచరీతో రెచ్చిపోవడంతో చివరి, ఆరో వన్డేలో భారత్ 8 వికెట్ల తేడాతో సఫారీలను చిత్తుగా ఓడించింది. ఆరు వన్డేల సిరీస్ను 5-1తో సొంతం చేసుకుంది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఆతిథ్య జట్టు 46.5 ఓవర్లలో 204 పరుగులకే కుప్పకూలింది. అనంతరం కోహ్లీ బ్యాటింగ్ ధాటికి భారత్ 32.1 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. కోహ్లీకే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్తో పాటు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు దక్కాయి.