వన్డే పోరు ముగిసింది. సుధీర్గ పర్యటన తుది దశకు చేరుకుంది. ఫటాఫట్ ఆటతో అలరించే పొట్టి క్రికెట్ వేళైంది. నేడే తొలి టీ20. వన్డే సిరీస్లో ఆతిథ్య జట్టును చితక్కొట్టేసిన భారత్ రెట్టించిన విశ్వాసంతో సిద్ధమవుతుండగా.. పరాభవాన్ని మరిచి పుంజుకోవాలని దక్షిణఫ్రికా కోరుకుంటోంది.
ఈ రోజు జరిగే తొలి టీ20 మ్యాచ్లో ఆతిథ్య దక్షిణాఫ్రికాను ఢీకొంటుంది. వన్డేల్లో దక్షిణాఫ్రికాను 5-1తో కసిదీరా బాదేసిన భారత్.. అదే జోరుతో బరిలోకి దిగుతోంది. రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, మనీష్ పాండే/రైనా, ధోని, హార్దిక్ పాండ్య, భువనేశ్వర్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ .. భారత్ జట్టు ఫైనల్లెవన్ అని అంచనా. ఐతే ఈ మ్యాచ్లో దృష్టంతా ఏడాది తర్వాత పునరాగమనం చేస్తున్న సురేశ్ రైనాపైనే. ఈ మ్యాచ్ కోసం సురేష్ రైనా ను ఎంపిక చేశారు. అతడు మ్యాచ్ ఆడి ఏడాది దాటింది. మొన్న మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు. దీంతో మరోసారి జట్టులోకి స్థానం సంపాదించాడు. అయితే ఫైనల్ జట్టులో అతడికి స్థానం దొరుకుతుందా లేదా అన్నది అనుమానం. ఈ మ్యాచ్ సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభం కానుంది.