భారత దేశంలోని ఎయిర్పోర్టుల చరిత్రలో కనీవినీ ఎరగనంత అక్రమ బంగారం బయటపడింది. శంషాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ఈ రోజు ఏకంగా 150 కేజీల అక్రమ బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కార్గో విభాగంలో తనిఖీలు నిర్వహించగా ఈ పసిడి గుట్టు రట్టయింది. దీన్ని మలేషియా నుంచి హైదరాబాద్కు తీసుకొచ్చారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి లేని సంస్థ దీన్ని తరలించినట్లు అధికారుల నుండి అందుతున్న సమాచారం.
ఆర్కే డిజిటల్ సంస్థ అనే దీన్ని తీసుకొచ్చిందని, ఈ రాకెట్ వెనుక హైదరాబాద్ వ్యక్తి ఉన్నాడని అనుమానిస్తున్నారు. అహ్మదాబాద్, ముంబై ముఠాల పాత్ర కూడా ఉందని, దర్యాప్తు తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. కొన్నాళ్లుగా ఆర్బీఐ అనుమతి లేకుండా కొన్ని భారతీయ కంపెనీలు మలేషియా, సింగపూర్ తదితర దేశాల నుంచి భారత్ వ్యాపారులకు అక్రమ బంగారాన్ని సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అది ఈరోజు జరిగిన ఘటనతో తేటతెల్లం అయ్యింది.