గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణానికి చెందిన జొన్నాదుల హేమవరప్రసాద్ ఈనెల ఒకటో తేదీన పానసోనిక్ ఏ2 స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసేందుకు రూ.9,800 తో అమెజాన్ సైట్ లో ఆర్డర్ చేశాడు. ఆ తర్వాత శుక్రవారం రోజు బ్లూడాట్ కొరియర్ సర్వీస్ డెలివరీ బాయ్ వచ్చి ప్యాకెట్ను అందజేశాడు. తన కొత్త ఫోన్ కోసం ఎంతో ఆతృతగా పాకెట్ ఓపెన్ చేసి చూడగా విమ్బార్ సబ్బు ఉంది.
దీంతో కంగుతిన్న ప్రసాద్ , కొరియర్బాయ్ను నిలదీయగా తనకెలాంటి సంబంధం లేదని చెప్పాడు. కంపెనీపై కేసు పెట్టాలని, తాను పార్శిల్ వచ్చినట్లు సాక్ష్యం మాత్రం ఇవ్వగలనని అతడు స్పష్టం చేశాడు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.