ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు, బెట్టింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మయ్యప్పన్ను క్రికెట్ సంబంధిత అన్ని వ్యవహరాల నుంచి బీసీసీఐ సస్పెండ్ చేసింది. బీసీసీఐ యాంటి కరప్షన్ కోడ్ నియమాల ప్రకారం ఆయన్ను సస్పెండ్ చేసినట్టు బీసీసీఐ సెక్రటరీ సంజయ్ జగ్దేల్ తెలిపారు.
మరో వైపు గురునాథ్ మేయప్పన్ విచారణకు సహకరించలేదని, ప్రశ్నలకు జవాబులు దాటేశారని పోలీసులు చెప్పారు. శుక్రవారం రాత్రి అరెస్టు చేసిన తర్వాత గురునాథ్ను కొన్ని గంటల పాటు పోలీసులు ప్రశ్నించారు. మధురై నుంచి ముంబైకి చేరుకోగానే పోలీసులు గురునాథ్ను క్రైం బ్రాంచ్ కేంద్ర కార్యాలయానికి తరలించారు.
గురునాథ్ ను హిమాంశ్ రాయ్ స్వయంగా రెండున్నర గంటల పాటు ప్రశ్నించారు. ఆ తర్వాత క్రైం బ్రాంచ్ బృందం ప్రశ్నించింది. అతను విచారణలో సహకరించలేదని, పలు ప్రశ్నలకు సమాధానాలు దాటవేశారని పోలీసులు శనివారం చెప్పారు. గురునాథ్ను ముంబై కోర్టు ఈ నెల 29వ తేదీ వరకు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.