రెండు గంటల్లో శ్రీవారి దర్శనం

ttd
తిరుమల శ్రీవారి దర్శనం కోసం గంటలే కాదు, కొన్ని సందర్భాల్లో రోజుకు పైగా చాంతాడంత క్యూలో వేచి ఉండాల్సిందే. అయితే, ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మాణిక్యాలరావు ప్రకటన కార్యరూపం దాల్చితే కేవలం రెండు గంటల్లో వెంకటేశ్వరస్వామి దర్శనభాగ్యం కలగనుంది. ఈ మేరకు మంత్రి మాణిక్యాలరావు కడప జిల్లాలోని ఓ ఆలయాన్ని సందర్శించిన సందర్భంగా వెంకన్న దర్శనానికి సంబంధించిన విషయాలపై మాట్లాడారు. గంటల తరబడి వెంకన్న దర్శనానికి ఇకపై చెల్లుచీటి ఇవ్వనున్నామని చెప్పిన మంత్రి, కేవలం రెండు గంటల్లోగా స్వామి వారి దర్శన భాగ్యం దక్కేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఆక్రమణలకు గురైన దేవాలయాల భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామని కూడా ఆయన ప్రకటించారు.