దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం ఉండడం తో మోడీ దేశ వ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటన చేసారు. ఏప్రిల్ 14 నాటికీ లాక్ డౌన్ పూర్తి కావడం తో మరోసారి లాక్ డౌన్ పొడిగిస్తారా లేదా అనే చర్చ నడుస్తుంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తే అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు ఎక్కువగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ ఎత్తివేస్తే పెద్ద ప్రమాదం జరగవచ్చని పలు రాష్ట్రాల సీఎం లు మోడీకి తెలియజేసారు. ఈ క్రమంలో లాక్డౌన్ను ఏప్రిల్ 30 వరకు పొడిగిస్తున్నట్లు ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
దేశంలో ప్రస్తుతం ఏప్రిల్14 వరకు 21 రోజుల లాక్డౌన్ అమలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే రోజురోజుకి కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో లాక్డౌన్ను ఏప్రిల్ 30 వరకు కొనసాగించాలని తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సీఎం నవీన్ పట్నాయక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో దేశంలో లాక్డౌన్ను పొడగించిన మొదటి రాష్ట్రంగా ఒడిశా నిలిచింది. కరోనా వ్యాప్తి దృష్ట్యా రైలు, విమాన సేవలను ఏప్రిల్ 30 వరకు ప్రారంభించవద్దని తెలిపారు. తమ రాష్ట్రంలో విద్యా సంస్థలు జూన్ 17 వరకూ తెరవబోమని నవీన్ పట్నాయక్ స్పష్టం చేశారు