Yatra 2 : హార్ట్ టచింగ్ గా ‘యాత్ర 2’ టీజర్.. ఫిబ్రవరి 8న గ్రాండ్ రిలీజ్


2009 నుంచి 2019 వరకు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌రిగిన రాజకీయ ఘటనల ఆధారంగా మహి వి రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘యాత్ర 2’. ఇందులో వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి పాత్ర‌లో మ‌ల‌యాళం సూప‌ర్ స్టార్ మ‌మ్ముట్టి, వై.ఎస్‌.జ‌గ‌న్‌ పాత్ర‌లో కోలీవుడ్ స్టార్ జీవా న‌టిస్తున్నారు. ప్రస్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 8న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలో శుక్రవారం మేకర్స్ ‘యాత్ర 2’ టీజర్‌ను విడుదల చేశారు.

టీజర్‌ను గమనిస్తే.. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి (మమ్ముట్టి) కొడుకుగా వై.ఎస్.జగన్ (జీవా) రాజకీయాల్లోకి రావటానికి కారణమేంటనే అంశాన్ని చిన్నహార్ట్ టచింగ్ సన్నివేశంతో చూపించారు. అదే సందర్భంలో తండ్రిలాంటి నాయకుడిని కోల్పోయినప్పుడు వారిని ఓదార్చటానికి ఓదార్పు యాత్ర చేద్దామంటే నాటి రాజకీయ నాయకులు ఎలాంటి అడ్డంకులు సృష్టించారనే విషయాన్ని కూడా చూపించే ప్రయత్నం చేశారు. అయితే ఆ అడ్డంకులను అన్నింటిని అధిగమించి.. తిరుగులేని ప్రజా నాయకుడిగా జగన్ ఎలా ఎదిగారనేదే ‘యాత్ర 2’ సినిమా. ఇందులో నారా చంద్రబాబు నాయుడు పాత్రలో బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పాత్రలో సుజానె బెర్నెర్ట్, వై.ఎస్.భారతి పాత్రలో కేతకి నారాయణన్ నటించారు. సంతోష్ నారాయణన్‌ సంగీతం అందిస్తున్నారు.

ఇకపోతే వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా ‘యాత్ర’ చిత్రాన్ని తెరకెక్కించారు. అత్యంత ప్ర‌జాద‌ర‌ణను పొందిన ఈ చిత్రంకు కొన‌సాగింపుగా ‘యాత్ర 2’ ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రానుంది. యాత్ర సినిమాను ఫిబ్ర‌వ‌రి 8, 2019లో విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. అలాగే ఇప్పుడు ‘యాత్ర 2’ ని కూడా అదే తేదీన అంటే 2024 ఫిబ్రవరి 8న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రానున్నారు.