ఆదివారం రాత్రి మాదాపూర్లో కమల్హాసన్ దర్శకత్వం వహించిన ‘విశ్వరూపం’ చిత్రం తెలుగు ఆడియో విడుదలైంది. ఈ ఆడియో వేడుకకు దర్శక రత్న దాసరి, డా. డి రామానాయుడు, రాజమౌళి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా దాసరి మాట్లాడుతూ.. “కమల్హాసన్ ప్రతిసారీ ఏదో ప్రయోగం చేయాలని ఉత్సాహం చూపుతాడు. ఆరోజుల్లో ‘విచిత్రసోదరులు’ చేశాడు. అది గొప్ప ప్రయోగం. కానీ ఇప్పటి టెక్నాలజీ అప్పుడులేదు. గుణ, వసంతకోకిల వంటి చిత్రాలు కూడా ఓ ప్రయోగమే. ప్రవాహానికి ఎదురు ఈదేవాడు కమల్. అందుకే టెక్నాలజీకి అనుగుణంగా ‘డిటిహెచ్’ ద్వారా సినిమాను విడుదలచేస్తున్నాడు. దీని ద్వారాపైరసీని అరికట్టవచ్చు అని దర్శకరత్న అభిప్రాయపడ్డారు. ‘డిటిహెచ్’ ప్రక్రియపై చాలా విమర్శలు వచ్చాయి. కొంతమంది ఎగ్జిబిటర్లు ఈ పద్ధతి వద్దని అడిగారు. తోలుబొమ్మలాట, నాటకాలు, మూకీ, బ్లాక్ అండ్వైట్, కలర్, స్కోప్, 3డి, డిటిఎస్, డిజిటల్, ఇప్పుడు డిటిహెచ్… ఇవన్నీ పరిణామక్రమంలో ప్రగతిని సాధించినవే. పైరసీని అరికట్టకపోతే నిర్మాత ఎలా మనుగడ సాధిస్తాడు. యుద్ధంలో తొలి అడుగువేసిన సైనికునికే దెబ్బలు తగులుతాయి. కమల్హాసన్ మొట్టమొదటి సైనికుడు” అని అభిప్రాయపడ్డారు.