మెగా ఇమేజ్‌ కోసం ఒరిజినల్‌నే మార్చేశారా?

మెగా హీరో వరుణ్‌ తేజ్‌ విలన్‌గా కనిపించబోతున్న ‘వాల్మీకి’ చిత్రం విడుదలకు సిద్దం అవుతుంది. షూటింగ్‌ దాదాపుగా పూర్తి అయినట్లుగా సమాచారం అందుతోంది. ఇక ఈ చిత్రం టీజర్‌ను తాజాగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ఈ చిత్రంలో వరుణ్‌ తేజ్‌ లుక్‌ ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతుంది. ఒక భయంకరమైన విలన్‌గా వరుణ్‌ కనిపిస్తున్నాడు. తమిళంలో సూపర్‌ హిట్‌ అయిన జిగర్తాండకు ఇది రీమేక్‌ అనే విషయం తెల్సిందే.

తమిళంలో బాబీ సింహా పోషించిన పాత్రను వరుణ్‌ తేజ్‌ పోషిస్తుండగా, సిద్దార్థ పోషించిన పాత్రను అధర్వ పోషిస్తున్నాడు. ఒరిజినల్‌ వర్షన్‌లో సిద్దార్థ పాత్రకు మాత్రమే లవర్‌ ఉంటుంది. ఇక ఈ చిత్రంలో అధర్వకు జోడీగా మృణాలిని నటిస్తుంది. మరి ఇదే సినిమాలో పూజా హెగ్డే నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒరిజినల్‌ వర్షన్‌లో బాబీ సింహాకు హీరోయిన్‌ ఉండదు. కాని ఇక్కడ మెగా హీరో కనుక ఒరిజినల్‌ వర్షన్‌లో మార్పులు చేసినట్లుగా అనిపిస్తుంది. మెగా ఇమేజ్‌ను కాపాడే ఉద్దేశ్యంతో హీరోయిన్‌ను జొప్పించడం జరిగిందట. ఇదే నిజమైతే సినిమా ఫలితం తేడా కొట్టే అవకాశాలు ఉన్నాయంటూ కొందరు విశ్లేషిస్తున్నారు. మరి కొందరు ఈ విషయమై సమర్ధిస్తున్నారు. మరి హరీష్‌ శంకర్‌ చేసిన ఈ ప్రయోగం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.