Suhas : నాకు అలాంటి సీన్స్ చేయాలంటే సిగ్గు..


“కలర్ ఫొటో”, “రైటర్ పద్మభూషణ్” సినిమాలతో యంగ్ హీరోగా పేరు తెచ్చుకున్నారు సుహాస్. కంటెంట్ ఓరియెంటెడ్ గా వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్నారు. సుహాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” ఫిబ్రవరి 2వ తేదీ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించారు. దర్శకుడు దుశ్యంత్ కటికినేని రూపొందించారు. ఇటీవలే జరిగిన ఇంటర్వ్యూలో “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” మూవీ హైలైట్స్ చెప్పారు హీరో సుహాస్.

గతేడాది ఫిబ్రవరిలో రైటర్ పద్మభూషణ్ రిలీజై మంచి సక్సెస్ అందుకుంది. ఈ ఫిబ్రవరికి “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” థియేటర్స్ లోకి వస్తోంది. ఈ సినిమా కూడా విజయం సాధిస్తుందనే నమ్ముతున్నాం. ఈ మధ్యే బాబు పుట్టాడు. మంచి జరుగుతుందనే అనిపిస్తోంది. ఈ సినిమా కోసం బ్యాండ్ కొట్టడం నేర్చుకున్నా.. అలాగే రెండు సార్లు గుండు గీయించుకున్నా. అమలాపురం, అంబాజీపేటలో షూటింగ్ చేశాం. ఈ కథలో జరిగిన ఇన్సిడెంట్స్ నేను రియల్ లైఫ్ లో చూడలేదు గానీ మా డైరెక్టర్ చూసిన సంఘటనలు కథలో సగం వరకు ఉంటాయి. తను చూసినవి, తనకు లైఫ్ లో జరిగిన కొన్ని సందర్భాల స్ఫూర్తి ఈ కథలో ఉంది. మిగతాది సినిమాటిక్ లిబర్టీ తీసుకుని చేశాడు.

“అంబాజీపేట మ్యారేజి బ్యాండు” 2007 లో జరిగే కథ. ఇంటర్వెల్ వరకు చూశాక సినిమా బాగా చేశారని ఫీల్ అవుతారు. ఆ తర్వాత మూవీ ఎమోషనల్ గా ఫీల్ తో సాగుతుంది. ఇప్పటిదాకా నేను చేసిన సినిమాలు సరదాగా సాగుతుంటాయి. కలర్ ఫొటోలో ఎమోషన్ కూడా ఉంటుంది. కానీ ఈ సినిమాలో హై ఎమోషన్ ఉంటుంది. రేపు సినిమా చూశాక ఇంత ఎమోషనల్ గా ఎలా నటించారని మీరే అడుగుతారు.

ఈ సినిమాలో కులాల ప్రస్తావన ఉంటుంది కానీ సినిమా అసలు నేపథ్యం కులాల గురించి కాదు. మనుషుల మధ్య అహం ఎలాంటి అడ్డుగోడలు సృష్టిస్తుంది అనేది మెయిన్ పాయింట్. నేను, శరణ్య కవల పిల్లలం. మా పుట్టినరోజున జరిగిన సంఘటనలు జీవితాలను ఎలాంటి మలుపులు తిప్పాయి అనేది ఈ మూవీలో కీలకంగా ఉండే అంశం. కథలోని చాలా సీన్స్ కు ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. ఈ సన్నివేశాల్లో కొన్ని మన జీవితాల్లో కూడా జరిగాయని అనిపిస్తుంది. ఈ స్క్రిప్ట్ చదివేప్పుడు ఉన్న ఎగ్జైట్ మెంట్ మేకింగ్ టైమ్ లో మరింత పెరిగింది. ఇప్పుడు శేఖర్ చంద్ర ఇచ్చిన బీజీఎంతో చూసుకున్నప్పుడు మరో లెవెల్ కు వెళ్లింది. ఫైనల్ కాపీ చూశాక చాలా సంతృప్తిగా అనిపించింది. మూవీకి హీరోను కాబట్టి రిలీజ్ టైమ్ లో ప్రెజర్ ఫీలవుతాం. నా భుజాల మీదే సినిమాను మోస్తానని అంటారు కదా. ఆ మాట వింటే భయమేస్తుంటుంది. టైటిలో మ్యారేజి బ్యాండు అనేది ఉంది. అయితే ఊరు పేర్లు వేరేవి అనుకున్నాం కానీ పలికేందుకు బాగుందని అంబాజీపేట యాడ్ చేశారు.

“అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమా చూసి అల్లు అరవింద్ గారు బాగుందంటూ ప్రశంసించారు. ఆయన సైమా వేడుకల్లో కలిసినప్పుడు బాగా నటించావయ్యా అని అప్రిషియేట్ చేశారు. ఆయన పొగడ్తలతో హ్యాపీగా ఫీలయ్యా. హీరోయిన్ శివానికి ఈ సినిమా తర్వాత మంచి పేరొస్తుంది. ఆమె పర్ ఫార్మెన్స్ అంత బాగా చేసింది. శివాని డ్యాన్సర్, సింగర్ కూడా. అక్క క్యారెక్టర్ చేసిన శరణ్య గారు, విలన్ గా చేసిన నితిన్ కూడా ఈ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. నాకు రొమాంటిక్ సీన్స్ చేయాలంటే సిగ్గు. మా డైరెక్టర్స్ మందలిస్తుంటారు. ఈ మూవీలో రొమాంటిక్ సీన్స్ చేసేప్పుడు డైరెక్టర్ సందీప్ లాంటి వాళ్లు ఫోన్ చేసి దుశ్యంత్ కు చెప్పారు ఈ సీన్స్ సరిగ్గా చేయడు జాగ్రత్త అని. నీ కెరీర్ లో ఇంకెప్పుడు చేస్తావ్ బ్రో రొమాంటిక్ సీన్స్.. చేయి అని దుశ్యంత్ అనేవాడు.

రైటర్ పద్మభూషణ్ కు ప్రీమియర్స్ వేయడం వల్ల మంచి టాక్ వచ్చింది. నా సినిమాలకు ప్రీమియర్స్ పడాలి. చూసిన వాళ్లు బాగుందని చెబితే మిగతా వాళ్లు బుకింగ్ చేసుకుని థియేటర్స్ కు వెళ్తారు. నాలాంటి హీరోలకు ప్రీమియర్స్ కు వచ్చే రెస్పాన్స్ చాలా ముఖ్యం. మేమంతా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. ఫిబ్రవరి 2న థియేటర్స్ లో చూడమని కోరుతున్నా.

ఇకపోతే కలర్ ఫొటో సందీప్ తో ఓ సినిమా చేయబోతున్నా. కథ చెప్పాడు. నెక్ట్ లెవెల్ లో ఉంది. ఆ మూవీకి డిస్కషన్స్ జరుగుతున్నాయి. సుకుమార్ గారి అసోసియేట్ తో ప్రసన్నవదనం అనే ఒక సినిమా చేశా. అది కంప్లీట్ అయ్యింది. కేబుల్ రెడ్డి అనే మరో మూవీ చేస్తున్నా. దిల్ రాజు గారి బ్యానర్ లో సలార్ రైటర్ తో ఒక మూవీ జరుగుతోంది అని తెలిపారు.