అల్లరి నరేష్, వైభవ్, రాజు సుందరం, కిక్ శ్యామ్ కథానాయకులుగా నటించిన త్రీడీ చిత్రం ‘యాక్షన్’. అనిల్ సుంకర దర్శకత్వం వహించారు. స్నేహా ఉల్లాల్, నీలమ్ ఉపాథ్యాయ, కామ్నా జెఠ్మలానీ, రీతూ బర్మేచా కథానాయికలు. ఈ చిత్రంలోని గీతాల్ని సోమవారం రాత్రి హైదరాబాద్ లో ఆవిష్కరించారు. తొలి సీడీని శ్రీనువైట్ల విడుదల చేశారు. అనంతరం అల్లరి నరేష్ మాట్లాడుతూ ”త్రీడీ సినిమా అంటే మాటలు కాదు. యేడాదిన్నర పాటు చిత్రబృందం కష్టపడింది. అనిల్ తన తొలి ప్రయత్నంతోనే మంచి సినిమా తీశాడ”న్నారు. అనిల్ సుంకర మాట్లాడుతూ ”ఈ సినిమా కోసం 130 రోజులు కష్టపడ్డాం. ఇది నా ఒక్కడి ఘనత కాదు. చిత్రబృందం అంతా… తమ సినిమా అనుకొని కష్టపడ్డారు. ఈ చిత్రానికి బప్పా, బప్పీలహరి అందించిన బాణీలు.. ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి” అన్నారు. శ్రీనువైట్ల మాట్లాడుతూ.. “అనిల్, నేనూ ఒకేసారి సినిమాల్లోకి అడుగుపెట్టాం. అప్పట్లో ఈవీవీ సత్యనారాయణ సినిమా ‘చెవిలో పువ్వు’ లాబ్ లో వేసినప్పుడు దొంగచాటుగా నేనూ… అనిల్ చూశాం. అవన్నీమర్చిపోలేని రోజులు..” అన్నారు. ఈ కార్యక్రమంలో బోయపాటి శ్రీను, వీరభద్రమ్, ఆదిశేషగిరిరావు, సుకుమార్, కోదండరామిరెడ్డి, సంగీత దర్శకుడు బప్పీలహరితో పాటు చిత్రబృందం పాల్గొన్నారు.