తెలుగు చిత్రసీమలో అగ్ర కథానాయకుల మధ్య మరోసారి… విభేధాలు పొడచూపాయా? ఇటీవల జరిగిన టీఎస్ఆర్ టీవీ 9 అవార్డుల కార్యక్రమాన్ని జాగ్రత్తగా గనిమిస్తే అవుననే అనిపిస్తుంది. అగ్ర కథానాయకులు బాలకృష్ణ, నాగార్జున మధ్య సైలెంట్ వార్ నడుస్తోందనే విషయం… ఇట్టే తెలిసిపోతుంది. ఇద్దరు చిర పరిచితులైన వ్యక్తులు, అందునా సమకాలికులు, పరిశ్రమలో అపార అనుభవం ఉన్నవాళ్లూ ఒకే వేడుకలో ఎదురైనప్పుడు కనీసం పలకరించుకోవడం ఓ సంప్రదాయం, మర్యాద. కానీ.. ఆ మర్యాద కూడా పాటించలేదు వీరిద్దరూ. వివరాల్లోకి వెళితే..
ఈ శనివారం హైదరాబాద్లోని శిల్పకళావేదికలో టీఎస్ఆర్ పురస్కారాల కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు చిత్రసీమలోని ప్రముఖులంతా హాజరయ్యారు. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ఱ, రామ్చరణ్లు కూడా వచ్చారు. నాగార్జున, బాలకృష్ణ సీట్లు పక్క పక్క నే రిజర్వ్ చేశారు. ముందుగా వచ్చిన బాలకృష్ణ తనకు కేటాయించిన స్థానంలో కూర్చున్నారు. ఆ తరవాత.. నాగ్ వచ్చారు. బాలయ్య పక్కన తన సీటు ఉండడం చూసి.. పక్కకెళ్లిపోయారు. కనీసం బాలయ్యను పలకరించలేదు కూడా. ఒక సందర్భంలో ఇక తప్పని పరిస్థితిలో షేక్ హ్యాండ్ ఇచ్చి వచ్చారు. అప్పుడు కూడా హాయ్.. అనే మాట కూడా లేదు.
వేదికపై కూడా బాలయ్యను ఒంటరివాడ్ని చేశారు. బాలయ్య అవార్డు పుచ్చుకొనేంత వరకూ నాగ్ వేదికపైనే ఉన్నారు. అవార్డు తీసుకోవడానికి బాలయ్య వేదిక ఎక్కే సందర్భంలో.. నాగ్ సైడ్ అయిపోయారు. వేదికపై బాలయ్య ఓ పక్క నిలబడితే.. మరోవైపు నాగ్, చిరు, రామ్చరణ్ గుమ్మిగూడారు. బాలయ్యను పట్టించుకోలేదు సరికదా… కనీసం పలకరించలేదు. ఈ వ్యవహారం ఎవరు పసిగట్టినా లేకపోయినా మీడియా దృష్టిని మాత్రం దాటిపోలేదు. బాలయ్యకు నాగ్ ఎడమొహంగా ఉండడానికి కూడా ఓ కారణం ఉందట. గత యేడాది సుబ్బిరామిరెడ్డి ఏర్పాటు చేసిన ఓ వేడుకలో ఎన్టీఆర్ ఫొటో కూడా పెట్టలేదట. అంతే కాదు.. తనని ఆహ్వానించడంలోనూ సుబ్బిరామిరెడ్డి నిర్లక్ష్యంగా ఉన్నారని, ఆహ్వాన పత్రంలో తన ఫొటో ప్రచురించలేదని బాలయ్య అలకపూనారట. ఈ విషయంలో నాగ్ సర్దిచెప్పబోతే.. బాలయ్య సరిగా స్పందించలేదట. దాంతో బాలయ్య, నాగ్ల మధ్య అంతంరం పెరిగిందని… అందుకే ఈ ఎడబాటని తెలుస్తోంది. మరి ఇందులో నిజానిజాలేమిటో ఆ ఇద్దరికే తెలియాలి.