ఇంతకాలం చిన్న సినిమాలతోనే సర్దుకొచ్చింది శాన్వి. ఇప్పుడు గేర్ మార్చి, పెద్ద దర్శకుల చేతిలో పడబోతోంది. రాంగోపాల్ వర్మ సినిమా ‘రౌడీ’లో శాన్వికి కథానాయిక పాత్ర దక్కింది. ఇప్పుడు ఆయన శిష్యడు పూరి జగన్నాథ్ కూడా శాన్వికి ఓ ఆఫర్ ఇచ్చాడు. పూరి – మహేష్ కలయికలో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసింది. ‘ఆగడు’ తరవాత ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. ఈలోగా ఓ చిన్న సినిమాని తెరకెక్కించాలన్నది పూరి ప్లాన్. ఆ చిత్రంలో కథానాయికగా శాన్విని ఎంచుకొన్నారు. ఈ విషయాన్ని పూరి తన ట్విట్టర్ లో తెలిపాడు. ‘రౌడీ’ సినిమాలోని కొన్ని సీన్స్ చూశా. అందులో శాన్వి బాగా చేసింది. నా తరవాతి సినిమాలో ఆమెను కథానాయికగా ఎంచుకోవాలనివుంది. త్వరలోనే ఆ వివరాలు ప్రకటిస్తా.. అంటున్నాడు పూరి. మొత్తానికి శాన్వికి మంచి ఛాన్స్ దక్కింది.