దాదాపు 25 సంవత్సరాల తర్వాత తెలుగులో వస్తున్న భారీ మల్టీ స్టారర్ చిత్రం “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు”. విక్టరీ వెంకటేశ్, సూపర్ స్టార్ మహేశ్ బాబు అన్నదమ్ములుగా నటిస్తోన్న ఈ చిత్రం ఓ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అన్న సంగతి అందరికీ ఇప్పటికే తెలిసిన విషయం. ఈ చిత్రం ప్రథమార్ధం హాయిగా, హ్యాపీగానే సాగిపోయినా ద్వితీయార్ధం మాత్రం బాగా సెంటిమెంట్ సీన్ లతో నిండి ఉందట. ఫ్యామిలీ ఆడియన్స్ ఎవరైనా సరే సెకండాఫ్ చూసిన తర్వాత కంటికి చెమ్మతోనే థియేటర్ నుండి బయటకు రావలసిందే అంటున్నారు ఇప్పటికే సినిమా రషెస్ చూసిన సినీ ప్రముఖులందరూ. సినిమా నిడివి తగ్గించడం కోసం కథను డిస్టర్బ్ చేసేలా ఉన్నకొన్ని హాస్య సన్నివేశాలు కత్తిరించెయ్యడం కూడా దీనికి మరో కారణం అని కూడా వినవచ్చింది. అలాగే నిన్ననే సూపర్ స్టార్ మహేశ్ కూడా ప్రసాద్ ల్యాబ్స్ లో ఈ చిత్రం చూశారట. సినిమా మొత్తం చూసిన తర్వాత తనకు అనిపించిన కొన్ని మార్పులు, చేర్పులు (చిన్నవే) సూచించారనీ, అందుకు నిర్మాత దిల్ రాజు కూడా మహేశ్ తో ఏకీభవించి ఆ చిన్న మార్పులను కూడా పూర్తి చేశారనీ తెలిసింది. మొత్తానికి ఈరోజే రిలీజైన నాయక్ కూడా ఓపెనింగ్ లోనే మంచి టాక్ సొంతం చేసుకోవడంతో “సీతమ్మ…” పై అంచనాలు మరింత పెరగడంతో చిత్ర యూనిట్ సినిమాను మరింత మెరుగుపరచడానికి ఏలాటి అవకాశమున్నా వదలదల్చుకోవడం లేదని తెలుస్తోంది. మొత్తమ్మీద 2013వ సంవత్సరం “సేవకుడు”తో ప్రారంభమయి నిరాశపరచినా “నాయక్”, “సీతమ్మ…” చిత్రాలతో మాంఛి ఊపులో కొస్తున్నట్లుగా కనిపిస్తోంది.