సందీప్ కిషన్ హీరోగా నిను వీడని నీడను నేనే అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో సందీప్ కిషన్ కూడా నిర్మాతగా మారాడు. ఈ సినిమా రేపు విడుదలవుతోన్న సందర్భంగా నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశాడు. ఈ సందర్భంగా ఈ సినిమాను గురించి ఆయన మాట్లాడుతూ తన సినిమాని కొంతమంది అడ్డుకోవాలని చూశారని, అడుగడుగునా ఆటంకం కలిగించారని మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశాడు.
విడుదలకు రెండు రోజుల ముందు కూడా ఈ సినిమా బయటకు వస్తుందా? రాదా? అని టెన్షన్ పడ్డానని, అవన్నీ దాటుకుని ఈ సినిమా విడుదల చేస్తున్నానని చెప్పుకొచ్చాడు సందీప్. ”12న విడుదల చేయాలని నువ్వే డిసైడ్ అయిపోతే ఎలా? నీ సినిమా ఎప్పుడు రావాలో చెప్పాల్సింది మేం” అని కొంతమంది బెదిరించారట. అయితే ఇది సినిమా అని నా ఇష్టం వచ్చినప్పుడు రిలీజ్ చేసుకుంటాననిని సందీప్ కూడా ఘాటుగానే సమాధానం ఇచ్చాడట.
ఈ సినిమా కోసం అందరూ ఎంతో కష్టపడి పనిచేశారని ఎవరికీ ఒక్క పైసా కూడా పెండింగ్ లో పెట్టలేదని రోజుకి 150 మందికి భోజనాలు పెడుతూ, ఒక కుటుంబ వాతావరణంలో ఈ సినిమా షూటింగును పూర్తిచేశామని చెప్పుకొచ్చాడు. ఎంతో నిజాయతీగా మేము ఈ సినిమాను తీస్తే, విడుదల ఆపడానికి కొంతమంది ప్రయత్నాలు చేయడం బాధ కలిగిస్తోందని ఆయన చెప్పుకొచ్చాడు. మా నిజాయితీయే ఈ సినిమాను విడుదల దిశగా నడిపించిందని అలాగే ఈ సినిమా తప్పకుండా హిట్ కొడుతుందని తన కెరియర్లోనే చెప్పుకోదగిన సినిమా అవుతుందనే నమ్మకం వుందని ఆయన చెప్పుకొచ్చాడు.