హిస్టారికల్ గా ‘రుద్రంగి’ టీజర్..


జగపతి బాబు, ఆశిష్ గాంధీ, మమతా మోహన్ దాస్, విమల రామన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా రుద్రంగి. బాహుబలి, ఆర్.ఆర్.ఆర్ చిత్రాలకు రైటర్ గా పని చేసిన అజయ్ సామ్రాట్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను రసమయి బాలకిషన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. స్వతంత్రం తర్వాత ఆనాటి తెలంగాణ సాంఘిక పరిస్థితుల నేపథ్యం లో ఈ చిత్రం రాబోతుంది. కాగా తాజాగా విడుదలైన ఈ మూవీ టీజర్ చాలా ఆసక్తికరంగా వుంది.

స్వాతంత్రం మాకే కానీ బానిసలకు కాదు, వాడు బలవంతుడి కావొచ్చు కానీ నేను భగవంతుడిని అనే మాటల ద్వారా జగపతి బాబు పాత్ర ఎంత క్రూరంగా ఉంటుంది, నాటి తెలంగాణాలో దొరల ఆగడాలు ఎలా ఉన్నాయి అనేది కళ్ళకు కట్టినట్టు చూపించబోతున్నారు అని తెలుస్తోంది. అలాంటి దొరకు మల్లేష్ అనే కుర్రాడు ఎదురు తిరిగితే అతన్ని ఏం చేశారు అనే కోణంతో పాటు అనేక వాస్తవ ఘటనలను తెరకెక్కించినట్టు ఈ టీజర్ చూస్తే అర్థమవుతోంది. టీజర్ ఆసాంతం చాల ఇంట్రెస్టింగ్ గా ఉంది. జగపతి బాబు పాత్ర ఇప్పటివరకు ఆయన కెరీర్ లో చేయనిదిగా ఉంది. ఆయన ఆహార్యం, వాచకం తోనే క్రూరత్వం కనిపిస్తోంది. ఇక జ్వాలాబాయి దేశ్ ముఖ్ గా మమతా మోహన్ దాస్ కూడా జగపతి పాత్రకు తీసిపోని విధంగా అహంకారంతో కనిపిస్తోంది. ఇక ఈ సినిమా మే 26న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.