తెలుగు తెరపై విలక్షణ నటుడు రావు రమేశ్ పాత్రలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. తనదైన స్టైల్ లో రావు రమేశ్ డైలాగ్స్ చెబుతూ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తున్నారు. ఇప్పటి వరకూ రావు రమేశ్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా వెండితెరపై కనిపించారు. అయితే ఇప్పుడు తనలోని మరో యాంగిల్ ను రావు రమేశ్ చూపించడానికి సిద్ధమయ్యారు. ఈ విలక్షణ నటుడు తొలిసారి హీరోగా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు. ఆయన పోషించబోయేది రెగ్యులర్ హీరో రోల్ కాదు. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మధ్య కాలంలో ప్రేక్షకులు కంటెంట్ బేస్డ్ సినిమాలను ఆదరిస్తున్నారు. హిందీలో ఆయుష్మాన్ ఖురానా, రాజ్ కుమార్ రావు, నవాజుద్దీన్ సిద్ధిఖీ వంటి యాక్టర్స్ చేసే సినిమాల తరహాలో ఈ సినిమా ఉండబోతోంది.
రావు రమేష్ టైటిల్ పాత్రలో పీబీఆర్ సినిమాస్ సంస్థ ప్రొడక్షన్ నంబర్ 2గా రూపొందిస్తున్న సినిమా ‘మారుతి నగర్ సుబ్రహ్మణ్యం’. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ మూవీస్ ‘పుష్ప’, ‘కెజియఫ్’, ‘ధమాకా’ తర్వాత ఆయన ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తున్న చిత్రమిది. ఈ సినిమాకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అలనాటి అందాల హీరోయిన్ ఇంద్రజ ఇందులో ఫీ మేల్ లీడ్ రోల్ లో కనిపిస్తోంది. ‘హ్యాపీ వెడ్డింగ్’ ఫేమ్ లక్షణ్ కార్య ఈ చిత్రానికి దర్శకుడు. ఈ రోజు సినిమాను అధికారికంగా ప్రకటించారు. చిత్ర దర్శకుడు లక్ష్మణ్ కార్య మాట్లాడుతూ ”వినోదాత్మక కుటుంబ కథా చిత్రమిది. రావు రమేష్ గారు లీడ్ రోల్ చేయడానికి అంగీకరించడం మా ఫస్ట్ సక్సెస్. కథ నచ్చి ఆయన ఓకే చేశారు. నడి వయసులో ఉన్న ఒక మధ్య తరగతి నిరుద్యోగి జీవితంలో క్షణ క్షణం జరిగే ట్విస్టులతో రెండు గంటల పాటు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తాం” అని చెప్పారు.