రభస.. ఈసినిమా ఎవరికి ఎలా ఉన్నా దర్శకుడు సంతోష్ శ్రీన్వాస్కి మాత్రం ప్రత్యేకం. ఈ సినిమా మొదలుపెట్టిన తరవాత… నాలుగు నెలలు షూటింగ్ ఆపాల్సివచ్చింది. కారణం.. దర్శకుడికి ఒంట్లో బాగోలేకపోవడమే. జాండీస్ వల్ల… మరణపు అంచుల వరకూ వెళ్లొచ్చాడు దర్శకుడు. ఆయన వల్ల సినిమా ఆగిపోయింది. మరో దర్శకుడిని తీసుకొన్నారని, సంతోష్ శ్రీన్వాస్ ని పక్కన పెట్టారని ప్రచారం కూడా జరిగింది. అయితే… దర్శకుడు కోలు కొన్నంతవరకూ షూటింగ్ ఆపి, ఆయన తేరుకొన్నాక మళ్లీ మొదలెట్టారు. అందుకే ఈఆడియో ఫంక్షన్లో సంతోష్ శ్రీన్వాస్ మాట్లాడుతూ ఎన్టీఆర్, బెల్లంకొండ సురేష్లను ప్రత్యేకంగా ప్రస్తావించాడు. వాళ్లు లేకపోతే ఈ సినిమానే లేదన్నాడు దర్శకుడు. తనపై పెట్టుకొన్న నమ్మకానికి జీవితాంతం రుణపడి ఉంటానన్నాడు. సంతోష్ స్పీచ్ ఆద్యంతం ఎమోషనల్ గా సాగింది. కంటతడి పెట్టుకొంటూ మాట్లాడుతోంటే… గొంతు బొంగురుబోయింది. ఆ సమయంలోనూ ఎన్టీఆర్ పక్కనే ఉండి ధైర్యం చెప్పడం విశేషం.”సంతోష్ కోసమైనా ఈ సినిమా ఆడుతుంది” అని ఎన్టీఆర్ భరోసా ఇచ్చాడు అభిమానులకు. మొత్తానికి రభస ఆడియో ఫంక్షన్లో దర్శకుడు అందరి హృదయాల్నీ బరువెక్కించాడు.