తెలుగులో భారీ సినిమాలకు పెట్టింది పేరు అల్లు అరవింద్. భారీ అంటే భారీగానే ఉంటాయి ఈయన సినిమాలు. తాజాగా ఆయన ఒక భారీ ప్రాజెక్ట్ చేస్తున్నాడని సమాచారం. రామాయణం ఎన్నిసార్లు చూసినా తనివి తీరని మహాకావ్యం. రాఅందుకే ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో ఎన్నిసార్లు రామాయణ గాథ చూపించినా కూడా ప్రేక్షకులు ఆదరించారు.
ఇప్పుడు కూడా మరోసారి ఇలాంటి భారీ ప్రయోగానికి రంగం సిద్ధం అవుతుంది. ఒకప్పుడు తెలుగు సినిమా మార్కెట్ 40 కోట్లు లేని రోజుల్లోనే రామ్ చరణ్ హీరోగా 40 కోట్లతో మగధీర సినిమా నిర్మించాడు అల్లు అరవింద్. ఆయన ఇచ్చిన ధైర్యంతోనే తెలుగులో భారీ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఆ రేంజ్ నాలుగు వందల కోట్ల దాకా చేరింది. ఇక ఇప్పుడు మరోసారి రామాయణంను 3డీలో చూపించేందుకు ఆయన సిద్దమయ్యారు.
అయితే మొత్తం 3 భాగాలుగా రామాయణాన్ని సినిమా రూపంలో చూపించనున్నారు నిర్మాతలు అల్లు అరవింద్, మధు వంతెన, నమిత్ మల్హోత్రా. దీని కోసం ఏకంగా 1500 కోట్లకు పైగానే ఖర్చు చేయబోతున్నారని సమాచారం. ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందనుంది. ఇందులో నటించబోయే నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలు మాత్రం వెల్లడికాలేదు. కేవలం డైరెక్టర్స్ పేర్లు మాత్రమే రివీల్ చేశారు. దంగల్ లాంటి సినిమా తెరకెక్కించిన నితీష్ తివారితో పాటు శ్రీదేవి చివరి చిత్రం మామ్ తెరకెక్కించిన రవి ఉద్యావర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు.