Site icon TeluguMirchi.com

‘సాహో’ బడ్జెట్‌పై ఫుల్‌ క్లారిటీ ఇచ్చిన ప్రభాస్‌

ప్రభాస్‌ హీరోగా బాహుబలి తర్వాత తెరకెక్కిన చిత్రం ‘సాహో’. సుజీత్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ సన్నిహితులు అయిన వంశీ మరియు ప్రమోద్‌లు యూవీ క్రియేషన్స్‌లో ఈ చిత్రంను నిర్మించారు. ఈ చిత్రం బడ్జెట్‌ విషయంలో రకరకాల వార్తలు వచ్చాయి. మొదట సాహో ప్రారంభించిన సమయంలో 150 కోట్ల బడ్జెట్‌ అంటూ అనధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత బడ్జెట్‌ పెరుగుతూ పెరుగుతూ పోయింది. ఏకంగా 300 కోట్లు అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. 300 కోట్ల వద్ద బడ్జెట్‌ ఆగిపోయింది. 300 కోట్లతో సినిమాను రూపొందించారని జాతీయ మీడియాలో కూడా కథనాలు వస్తున్నాయి.

ఇలాంటి సమయంలో ప్రభాస్‌ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సాహో బడ్జెట్‌పై క్లారిటీ ఇచ్చాడు. ఈ చిత్రంకు 250, 300 కోట్లు పెట్టినట్లుగా వస్తున్న వార్తలు నిజం కాదు. ఈ చిత్రంలో ఎక్కడ రాజీ పడవద్దనే ఉద్దేశ్యంతో ఏకంగా 350 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరిగింది. సినిమాలో కనిపించే ప్రతి ఒక్క ఎలిమెంట్‌ కూడా ప్రపంచంలోనే గొప్పవి అని, వాటన్నింటిని తీసుకు వచ్చి సరిగ్గా మేళవించి ఈ చిత్రంను తెరకెక్కించడం జరిగింది. ఈ చిత్రంలో కనిపించే పింక్‌ లేక్‌ ఆస్ట్రేలియాలో ఉంటుంది. అలా ప్రతి ఒక్కటి కూడా రియల్‌గా ఉన్నవే. దేన్ని కూడా గ్రాఫిక్స్‌లో చూపించే ప్రయత్నం చేయలేదు. అందుకే ఇంత బడ్జెట్‌ అయ్యిందని ప్రభాస్‌ అన్నాడు. 350 కోట్లు పెట్టినా అంతకు మించి వస్తాయనే నమ్మకంతో యూనిట్‌ సభ్యులు ఉన్నారు.

Exit mobile version