ఎవడు, అత్తారింటికి దారేది ఆగస్టులో విడుదల కావా? సెప్టెంబరు వరకూ ఈ వాయిదాల పర్వం కొనసాగుతుందా? ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్న విషయం ఇదే. ఎవడు, అత్తారింటికి దారేది, తుఫాన్ వరుసగా నెల రోజుల వ్యవధిలో మూడు సినిమాలు చూసేయొచ్చు అని గంపెడు ఆశలు పెట్టుకొన్నారు. అయితే సమాఖ్యాంధ్ర ఉద్యమ సెగ ఈ సినిమాలకు తీవ్రంగా తగిలింది. దాంతో వాయిదాల మీద వాయిదాలు వేసుకొంటున్నారు. అత్తారింటికి ఆగస్టు 14న రావడం ఖాయమని కొందరు చెబుతున్నా – అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఎందుకంటే ఉద్యమ తీవ్రత రోజురోజుకీ ఎక్కువ అవుతుంది తప్ప, ఓ దారికి రావడం లేదు. ఒకవేళ 14న రాకపోతే 21న విడుదల చేయడం కూడా కష్టమే. ఎందుకంటే ఆ రోజు ఎవడు రిలీజ్ అవ్వాలి. థియేటర్లు ముందే బుక్ అయిపోయాయి. ఎవడు రిలీజ్ అయినా అవ్వకపోయినా ఆ థియేటర్లు బ్లాక్ చేయడం వలన కొత్త సినిమా వచ్చే అవకాశం లేదు. దాంతో అత్తారింటికి ఈనెలలో రావడం కష్టమే. సీమాంధ్రలో మెగా హీరోల సినిమా రిలీజ్ కానివ్వం అని ఉద్యమ దారులు గట్టిగా చెబుతున్నారు. ఈదశలో ఎవడు, తుఫాన్ సినిమాల్ని విడుదల చేయడానికి ఏ నిర్మాతా ధైర్యం చేయలేడు. రాబోయే వారం రోజుల్లో ఉద్యమ సెగ తగ్గితే ఫర్లేదు. లేదంటే.. మెగా సినిమాల్ని చూడడం ఇప్పట్లో సాధ్యమయ్యే విషయం కాదు.