డబ్బింగ్ మొదలు పెట్టిన వైఎస్..

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి దివంగ‌త నేత డాక్ట‌ర్‌. వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి గారి బ‌యోపిక్ ని భ‌లేమంచి రోజు, ఆనందో బ్ర‌హ్మ లాంటి విజ‌యాలు సాధించిన నిర్మాత‌లు విజ‌య్ చిల్లా, శ‌శిదేవి రెడ్డి లు సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. ఆనందో బ్ర‌హ్మ లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన మ‌హి.వి.రాఘ‌వ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో డా..వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి గారి పాత్ర‌లో మ‌ళ‌యాల సూప‌ర్‌స్టార్ మ‌మ్మూట్టి నటిస్తున్నాడు.

జులై 08 వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి జయంతి సందర్బంగా విడుదలైన యాత్ర ఫస్ట్ లుక్ టీజర్ యావత్ ప్రేక్షకులను వైఎస్ అభిమానులను ఆకట్టుకుంది. తెలుసుకోవాలని ఉంది.. వినాలని ఉంది.. ఈ కడప దాటి ప్రతీ గడపలోకి వెళ్లాలని ఉంది.. వాళ్లతో కలిసి నడవాలని ఉంది.. వాళ్ల గుండె చప్పుడు వినాలని ఉంది. గెలిస్తే పట్టుదల అంటారు, ఓడిపోతే మూర్ఖత్వం అంటారు. పాదయాత్ర నా మూర్ఖత్వమో.. పట్టుదలో… చరిత్రే నిర్ణయిస్తుంది’ అంటూ మ‌మ్మూట్టి డైలాగ్స్ అదరగొట్టాడు.

ఇక తాజాగా ఈ చిత్ర డబ్బింగ్ ను మ‌మ్మూట్టి హైదరాబాద్ లోని శబ్దలయ డబ్బింగ్ స్టూడియో లో మొదలు పెట్టారు. డబ్బింగ్ స్టూడియో నుంచి మమ్ముట్టితో పాటు చిత్ర దర్శకుడు మహి.వి.రాఘవ్.. నిర్మాతలు కలిసి ఫొటో దిగి దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘యాత్ర’ షూటింగ్ మొదలై రెండు నెలలు కూడా కాలేదు. అప్పుడే డబ్బింగ్ పని మొదలుపెట్టేయడం విశేషమే. వైఎస్ ఎలా అయితే నిర్విరామంగా పాదయాత్రలో పాల్గొన్నాడో.. అదే తరహాలో విరామం లేకుండా ఈ సినిమా చిత్రీకరణను ఒకే షెడ్యూల్లో పూర్తి చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటుందని నిర్మాతలు తెలిపారు.

జగపతిబాబు, సుహాసిని, రావు రమేష్, అనసూయ, సచిన్ ఖేడేకర్ వంటి భారీ తారాగణం నటిస్తున్న ఈ చిత్రాన్ని 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.