ఇస్మార్ట్ శంకర్ చిత్రం తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న హీరో రామ్..సూపర్ స్టార్ మహేష్ బాబు ను కలిశారు. రామ్ – పూరి జగన్నాథ్ కాంబినేషన్లో పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి జగన్నాథ్, ఛార్మి నిర్మించిన చిత్రం ఇస్మార్ట్ శంకర్. గత నెలలో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
భరత్ అనే నేను, మహర్షి సినిమాల వరుస సక్సెస్ లతో మంచి జోరు మీదున్న మహేష్.. ప్రస్తుతం ఆయన హీరోగా రూపొందుతున్న సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటిస్తున్నాడు. హైదరాబాద్ లో రెండవ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో మహేష్ బాబు, రామ్ ఒకరికొకరు ఎదురుబడ్డారు. ఎక్కడ కలుసుకున్నారో తెలియదు గానీ ఇద్దరూ చాలా సేపు ముచ్చటించుకున్నారు. ఇప్పుడు ఈ ఫొటో సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతుంది.
సరిలేరు నీకెవ్వరు మొదటి షెడ్యూల్ కశ్మీర్లో పూర్తయింది. తాజాగా రెండో షెడ్యూల్ మొదలైంది. ఈ షెడ్యూల్లో రైలు సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారని, చాలా వినోదాత్మకంగా ఉంటుందని అనిల్ సుంకర ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఈ చిత్రం లో మహేష్ మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో కనిపిస్తున్నాడు.