ఒళ్ళు గగుర్పొడిచేలా ‘మా ఊరి పొలిమేర‌-2’ టీజ‌ర్ !


క్షుద్ర పూజలు, తంత్రాలు ఇలాంటి వైవిధ్యమైన అంశాలతో 2021 లో వచ్చిన ‘మా ఊరి పొలిమేర’.. ఓటిటీలో ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఇక ఇప్పుడు ‘మా ఊరి పొలిమేర-2’ కూడా వస్తుంది. శ్రీకృష్ణ క్రియేష‌న్స్ బేన‌ర్ పై గౌరు గ‌ణ‌బాబు స‌మ‌ర్ప‌ణ‌లో గౌరికృష్ణ నిర్మాత‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి డా.అనిల్ విశ్వ‌నాథ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ చిత్రం అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని ఈ నెలాఖ‌రులో విడుద‌ల‌కు సిద్ధ‌మవుతున్న నేప‌థ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన టీజ‌ర్ ను మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ లాంచ్ చేశారు.

ఇక టీజర్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. అంతేకాదు ఒళ్ళు గగుర్పాటు పొడిచే సీన్స్ అందర్నీ భయపెట్టే విధంగా వున్నాయి. ప్రాణం తీస్తే తప్పుకాని, బలిస్తే తప్పేంటి అన్న డైలాగ్ సినిమాపై మరింత ఆసక్తిని నెలకొల్పింది. ఇక చివర్లో సత్యం రాజేష్‌ రక్తాన్ని ఒంటిమీద పోసుకునే సీన్‌ అయితే టీజర్‌కే హైలేట్‌గా నిలిచింది. కాగా సత్యం రాజేష్‌, డా. కామాక్షి భాస్కర్ల, గెట‌ప్ శ్రీను, రాకెండ్ మౌళి, బాలాదిత్య, సాహితి దాస‌రి, ర‌వి వ‌ర్మ‌, చిత్రం శ్రీను ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు.

ఇకపోతే టీజర్ లాంచ్ సంద‌ర్భంగా మెగాప్రిన్స్ వ‌రుణ్ తేజ్ మాట్లాడుతూ…“సత్యం రాజేష్ నాకు మంచి మిత్రుడు. ఓటీటీలో త‌ను న‌టించిన‌ ‘మా ఊరి పొలిమేర‌’ చూశాను. నాకు చాలా బాగా న‌చ్చింది. దానికి సీక్వెల్ గా రూపొందుతోన్న ‘మా ఊరి పొలిమేర‌-2’ టీజ‌ర్ కూడా చాలా ఇంట్ర‌స్టింగ్ గా ఉంది. మొద‌టి పార్ట్ లా సెకండ్ పార్ట్ కూడా పెద్ద హిట్ అవ్వాల‌ని కోరుకుంటూ టీమ్ అంద‌రికీ నా శుభాకాంక్ష‌లు“ అన్నారు.