అక్కినేని నాగేశ్వరరావు సినిమాల్లోకి రాకముందు డ్రామా ఆర్టిస్ట్. స్టేజీపై ఆడ వేషంలో ఆడేవారు, పాడేవారు! పాటంటే మామూలుగానే కాదు. అందులోనూ ప్రొఫెషనలిజం కనిపించేది. అయితే గాయకుడిగా ఆయన్ని ఎవరూ గుర్తించలేదు. ఇప్పుడో గాయని అక్కినేనిలో ఉన్న గాన మాధుర్యాన్ని గుర్తించారు. ఆమె ఎవరో కాదు.. పి.సుశీల. ప్రతీ యేటా తన పేరుతో గాయనీ గాయకులకు పురస్కారం ప్రదానం చేస్తారామె. ఈ యేడాది ఆ అవకాశం వాణీజయరామ్ కి దక్కింది. ఈ సందర్భంగా సుశీల మాట్లాడుతూ ”అక్కినేని నాగేశ్వరరావు మంచి గాయకుడు. ఆయన పాటల్ని చాలాసార్లు నేను విన్నాను. ఆడ గొంతుతో కూడా పాటలు పాడేవారు. నా పేరుతో ప్రతీ యేటా గాయనీగాయకులకు పురస్కారాలు ఇస్తున్నా. ఈ యేడాది పి.సుశీల అవార్డు అక్కినేనికి ఇద్దామనుకొన్నా. కానీ ఆయనకు ఆరోగ్యం బాగాలేదని తెలిసి.. వాణీజయరామ్ ని ఎంచుకొన్నాం. అందుకే ఈ అవార్డు కార్యక్రమాన్ని అక్కినేనికే అంకితం చేస్తున్నాం..” అన్నారామె.