మెగా హీరో సినిమా వస్తుందంటే ఎంత సంబరం ఉండేది?
పవన్ కల్యాణ్, రామ్చరణ్, అల్లు అర్జున్ ఆఖరికి అల్లు శిరీష్ సినిమా అయినా సరే ఎన్నో అంచనాలు.
సినిమా ఎలా ఉంటుంది? అందులో హీరో క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది? ఎన్ని ఫైట్లుంటాయి? ఎన్ని రికార్డులు బద్దలకొడుతుంది? ఇలా ఎన్ని ప్రశ్నలో? సినిమా వచ్చి వెళ్లిపోయే వరకూ అభిమానులు ఇలాంటి లెక్కల్లో మునిగిపోయేవారు. కానీ ఇవేవీ తుఫాన్ సినిమాకి లేవు. ఒకే ఒక్క ప్రశ్న తప్ప. ఈ సినిమా చూస్తారా?? లేదా?? అని.
చిరంజీవి గారి అబ్బాయి అనే ట్యాగ్ లైన్ ఇన్నాళ్లూ చరణ్కి వెయ్యి ఏనుగుల బలం. ఇప్పుడు అదే బలహీనతగా మారడం యాదృచ్చికం కాదు, స్వయంకృతాపరాథం. వీటి వెనుక రాజకీయ కారణం ఉండడం మాత్రం విధి లిఖితమే. తెలంగాణ ఉద్యమం ముగిసింది, ఇప్పుడు ఆ సెగ సీమాంధ్రకు పాకింది. ఇప్పుడు చిరు కేంద్రమంతి అయ్యి ఉండొచ్చు గాక. కానీ సీమాంధ్ర బిడ్డే! చిరుకి తిరుగులేని ఇమేజ్ రావడానికీ, అతని కుటుంబీకులు హీరోలుగా ఎదగడానికి – అక్కడి అభిమానుల బలమే ప్రధాన కారణం అని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. చిరు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా సీమాంధ్ర సపోర్ట్ చేసుకొనే రంగంలోకి దిగాడు. మొగల్తూరు మొనగాడుగా కీర్తిగడించి, పాలకొల్లు నుంచి పోటీ చేశాడు.
ఇప్పుడు ఆ ప్రాంతానికి తన అవసరం కావల్సివచ్చినప్పుడు మాత్రం మొఖం చాటేశాడు. ఇది వ్యక్తిగతంగా చిరంజీవికే కాదు, అతని కుటుంబ హీరోలకూ ముఖ్యంగా చరణ్కీ పెద్ద దెబ్బ. మెగా హీరోల సినిమాల్ని సీమాంధ్రలో ఆడించం.. అని సమాఖ్యంధ్ర జేఏసీ ప్రకటించినప్పటి నుంచీ మెగా క్యాంపస్లో రైళ్లు పరిగెడుతున్నాయి. చిరుతో అంటీముట్టనట్టు వ్యవహరించే పవన్ కల్యాణ్ సైతం తన సినిమాని ఎందుకైనా మంచిదని అక్టోబరు నాటికి వాయిదా వేసుకొన్నాడు. ఇక చరణ్ ఎంత భయపడాలి?? అందుకే ఎవడు సినిమాని వాయిదా వేశారు. తుఫాన్కి మాత్రం ఆ అవకాశం లేదు. ఎందుకంటే ఇది బాలీవుడ్ సినిమా. అక్కడి నిర్మాతల హ్యూహం ప్రకారమే సినిమా విడుదల చేయాల్సివుంది. అందుకే ఈ సినిమా ముందే అనుకొన్నట్టు 6న వచ్చేస్తోంది. అయితే అందరిలో ఒక్కటే అనుమానం. ఈ తుఫాన్ కి సీమాంధ్రలో టికెట్లు తెగుతాయా? లేదా? కనీసం బొమ్మ పడనిస్తారా? లేదా? అని. ఇదంతా చిరు ఎఫెక్టే!
తన రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు చిరంజీవి. అది చిరుకి ఎంత మేలు చేసిందో తెలీదు గానీ – సీమాంధ్రలో మాత్రం చిరుపై గుర్రుగా ఉన్నారు. ఇప్పుడు రాష్ట్ర్రాన్ని రెండు ముక్కలు చేసి, కోస్తాంద్రకు అన్యాయం చేసినా చిరు మిన్నకుండిపోయాడనే మరో నింద కూడా మోస్తున్నాడు. దాంతో హీరోగా వెలిగిన చిరు… అక్కడ విలన్ అయ్యాడు. అయితే చిరు ఆలస్యంగా స్పందించి – సీమాంధ్ర తరపున మాట్లాడడం కూడా ఓ జోక్ అయిపోయింది. రాజీనామా చేయకుండా డ్రామాలు ఆడుతున్నాడని బాహాటంగానే చెబుతున్నారు. అయితే చిరుకి ఇది మరో రకంగా దెబ్బకొట్టింది. ఎప్పుడైతే సీమాంధ్రకు మద్దతుగా మాట్లాడారో, అప్పుడు చిరు తెలంగాణకు విలన్ అయిపోయాడు. ఇక్కడ నీ సినిమాలు ఎలా ఆడతాయో చూస్తాం అంటున్నారు తెలంగాణ వాదులు. అటు సీమాంధ్రలోనూ, ఇటు తెలంగాణలోనూ చిరు ఫ్యూజ్ మాడిపోయింది. ఇప్పుడు ఆ ప్రభావం రామ్చరణ్ సినిమా తుఫాన్ పై పడబోతోంది.
ఈ సినిమాని రెండు చోట్లా ఎలా ఆదరిస్తారు అనే టెన్షన్ అటు చిత్ర నిర్మాతలు, ఇటు చరణ్ కంటే చిరుకే ఎక్కువ ఉంది. ఈ సినిమాని తిప్పికొడితే మాత్రం చిరుకి అది తీరని అవమానమే. సినిమానే తిరస్కరిస్తే, అక్కడ రాజకీయంగా తన భవిష్యత్తు ప్రశ్నార్థకమే అనే భయం పుట్టింది. దాంతో 6వ తారీఖుకి ప్రాముఖ్యత పెరిగింది. తుఫాన్ ఫలితాన్ని బట్టి – రాజకీయంగానూ చిరు కొత్త నిర్ణయాలు తీసుకొన్నా ఆశ్చర్యపోనవసరం లేదు. చూద్దాం ఆ రోజు ఏమవుతుందో.??