ఫుల్ ఎంటర్ టైనింగ్ గా ‘బ్రో’ ట్రైలర్ !


తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ ద్వయం మొదటిసారి కలిసి నటిస్తున్న ‘బ్రో’ చిత్రం కోసం జీ స్టూడియోస్‌తో చేతులు కలిపింది. సముద్రఖని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ప్రోమోలు, టీజర్ మరియు మై డియర్ మార్కండేయ, జానవులే పాటలకు వచ్చిన స్పందనతో చిత్ర బృందం ఎంతో సంతోషంగా ఉంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ట్రైలర్ ను విడుదల చేశారు.

భస్మాసురుడు అని ఒకడు ఉండేవాడు తెలుసా? మీ మనుషులు అందరూ వాడి వారసులు. ఎవడి తల మీద వాడే పెట్టుకుంటాడు. ఎవ్వరికీ ఛాన్స్ ఇవ్వరు అనే పవన్ కళ్యాణ్ డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత తనకు జీవితంలో దేనికీ సమయం లేదంటూ ప్రతి దానికి కంగారు పడుతూ ఇంట్లోనూ, పని దగ్గర హడావుడిగా ఉండే సాయి ధరమ్ తేజ్‌ ఎంటర్ అవుతాడు. అతని ప్రేయసిగా కేతికా శర్మ కనిపిస్తుంది. ఒక దుర్ఘటన మరియు సమయానికి ప్రాతినిధ్యం వహించే పవన్ కళ్యాణ్ రాక తర్వాత, అతని జీవితం ఒక్కసారిగా మలుపు తిరుగుతుంది. ఇకపోతే సాయి ధ‌ర‌మ్ తేజ్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ల‌ మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు చూస్తుంటే ఈసారి ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ ఖాయం. అంతేకాదు కింగ్ సినిమాలోని బ్రహ్మానందం యొక్క ఐకానిక్ డైలాగ్‌ను పవన్ కళ్యాణ్ రీక్రియేట్ చేయడం, జల్సా స్టెప్ వేయడం మరియు సాయి ధరమ్ తేజ్‌ తో కలిసి కాలు కదపడం వంటి అందమైన మూమెంట్స్ తో ట్రైలర్ ను ముగించిన తీరు అమితంగా ఆకట్టుకుంది. అలాగే తనకు లిప్‌స్టిక్‌ రుచి కూడా తెలియదని పవన్‌ కళ్యాణ్ తో సాయి ధరమ్ తేజ్ చెప్పడం నవ్వులు పూయించింది.

ఇకపోతే డ్యాన్స్ స్టెప్పులు, కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీతో ఈ చిత్రం ప్రేక్షకులకు వింటేజ్ పవన్ కళ్యాణ్‌ని గుర్తు చేస్తుంది. సముద్రఖని కథ విషయంలో రాజీ పడకుండా అభిమానులను మెప్పించేలా సినిమాను అద్భుతంగా రూపొందించారు. త్రివిక్రమ్ డైలాగ్స్, సాయి ధరమ్ తేజ్ స్క్రీన్ ప్రెజెన్స్, గ్రాండ్ విజువల్స్ మరియు థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌కి ప్రధాన బలంగా నిలిచాయి.