అతిలోక సుందరి శ్రీదేవి చిత్ర పరిశ్రమను, అభిమానుల్ని శోకసంద్రంలో ముంచి, తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. దుబాయ్లోని ఓ హోటల్ గదిలో ప్రమాదవశాత్తు బాత్టబ్లో పడి ఆమె మరణించారు. శ్రీదేవి మరణం తారాలోకాన్ని, అభిమానులని ఎంతగానో కలిచి వేసింది.ఆమె చనిపోయి సరిగ్గా వారం కావొస్తోంది. అయితే శ్రీదేవి మృతిపై అప్పట్లో చాలానే అనుమానాలు వ్యక్తమయ్యాయి. తొలుత గుండెపోటుతో చనిపోయారన్నారు. ఆ తర్వాత హోటల్ గదిలోని బాత్టబ్లో పడి మృతిచెందారని ధృవీకరించారు.
దీనిపై ఆమె భర్త బోనీకపూర్ తన స్నేహితుడు, సినీ విశ్లేషకుడు కోమల్ నహతాకు వివరించారట. ఈ విషయాలన్నీ కోమల్ తన బ్లాగ్లో రాశారు. ఇంతకీ అక్కడ ఏం రాశారంటే..
”మోహిత్( శ్రీదేవి మేమల్లుడు) పెళ్లయ్యాక జాన్వికి కు దుస్తులు కొనడానికి శ్రీదేవి కొన్ని రోజులు దుబాయ్లోనే ఉంటానంది. దాంతో నాకు లఖ్నవూలో పనుండి ఇండియా వచ్చేశాను. ఫిబ్రవరి 24న ఉదయం శ్రీదేవి నాకు ఫోన్ చేసింది. నన్ను చాలా మిస్సవుతున్నానని చెప్పింది. శ్రీదేవికి ఒంటరిగా ఉండే అలవాటు లేదు. అందుకే ‘తొందరగా దుబాయ్కి బయలుదేరు డాడీ’ అని జాన్వి నాకు చెప్పింది. ‘ఫిబ్రవరి 24న సాయంత్రం 6.20 గంటల సమయంలో దుబాయ్ చేరుకున్నాను. శ్రీదేవి నన్ను చూసి సర్ప్రైజ్ అయ్యింది. అరగంట పాటు ఇద్దరం మాట్లాడుకుంటూ కూర్చున్నాం. ఆ తర్వాత ఇద్దరం కలిసి డిన్నర్కి వెళ్లాలనుకున్నాం. శ్రీదేవి స్నానం చేసి వస్తానంది. తను వచ్చేవరకు టీవీ చూస్తూ కూర్చున్నాను. కానీ ఎంతసేపటికీ గది నుంచి బయటికి రాలేదు. ఏం జరిగిందో చూద్దామని గదిలోకి వెళ్లాను. తను ఇంకా బాత్రూమ్ నుంచి బయటకు రాలేదు. పలుమార్లు తలుపు కొట్టి చూశాను. రియాక్షన్ లేదు. బాత్రూమ్ తలుపు గడియ పెట్టలేదు. దాంతో లోపలికి వెళ్లాను. తీరా చూస్తే నీరు నిండా ఉన్న బాత్టబ్లో మునిగిపోయి ఉంది. ఆమె మునిగిపోవడం కాదు మమ్మల్ని తీరని శోకంలోకి నెట్టేసింది”అని బోణీ చెప్పినట్లు కోమల్ నహతా తన బ్లాగ్ లో రాసుకొచ్చారు.