చేతులు మారిన కన్నప్ప


మిథునం సినిమాతో అద్భుతః అనిపించుకొన్నారు త‌నికెళ్ల భ‌ర‌ణి. ఆ త‌ర‌వాత‌.. న‌టుడిగా మ‌ళ్లీ బిజీ అయిపోయారు. మిథునం త‌ర‌వాత‌ భక్త క‌న్నప్ప క‌థ‌ని వెండి తెర‌కెక్కించాల‌ని భావించారు త‌నికెళ్ల భ‌ర‌ణి. ముందు సునీల్‌ని హీరో అనుకొన్నారు. ఆ త‌ర‌వాత విష్ణు చేతికి చేరింది. భరణి దర్శకత్వంలో చేయాల్సిన సినిమా ఇది. కానీ ఇపుడు విష్ణు ఆలోచ‌న‌లు వేరుగా ఉన్నాయి.

భ‌ర‌ణి నుంచి స్క్రిప్టు కొనుక్కుని, దానికి త‌మ‌వైన మార్పులు చేసుకొని దాన్నో అంత‌ర్జాతీయ ప్రాజెక్టుగా తీర్చిదిద్దాల‌న్న ప్ర‌య‌త్నాల్లో ఉన్నాడు విష్ణు. అందుకోసం కొంత‌మంది ద‌ర్శ‌కుల్ని సంప్ర‌దించాడు కూడా. ఓ ద‌శ‌లో కృష్ణ‌వంశీ పేరు కూడా బ‌లంగా వినిపించింది. అయితే ఇప్పుడు మాత్రం ఈ సినిమా కోసం హాలీవుడ్ ద‌ర్శ‌కుడ్ని దిగుమ‌తి చేయాల‌న్న ఆలోచ‌న కొచ్చాడు విష్ణు. త్వరలోనే ఈ సినిమా పై ఒక ప్రకటన రానుంది.