ఇలాంటి వేడుక ‘బలగం’ సినిమాకే మొదటిసారి..


ప్రియదర్శి, కావ్య కళ్యాణ్‌ రామ్‌, సుధాకర్‌ రెడ్డి, మురళీధర్‌ గౌడ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా బలగం. దిల్‌ రాజు ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై హర్షిత్‌ రెడ్డి, హన్షిత నిర్మించిన ఈ సినిమాకు వేణు ఎల్దండి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా వంద అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి. ఈ సందర్భంగా ‘విశ్వ విజయ శతకం’ ఈవెంట్‌ను నిర్వహించారు.

ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ.. ‘నేను ఎన్నో వంద రోజుల ఫంక్షన్‌లు చూశాను. వంద కోట్ల పోస్టర్‌ను చూశాను. కానీ మొదటి సారి ఇలా వంద అవార్డుల ఫంక్షన్‌ను చూస్తున్నా. ఈ కథను మా దగ్గరకు తీసుకొచ్చిన వేణుకి, వేణుని మా దగ్గరికి తీసుకొచ్చిన ఈస్ట్ డిస్ట్రిబ్యూటర్ శివరాంకు థాంక్స్. వేణు వెళ్లి శివరాంకు కథ ఎందుకు చెప్పాడో.. ఆయన నా దగ్గరకు ఎందుకు తీసుకొచ్చాడో.. బలగం ఈ రోజు ఇంత పెద్ద హిట్ అయిందంటే కారణం వాళ్లే. వేణుతో పని చేసిన టీంకు థాంక్స్. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. చిన్న సినిమా అయినా కూడా మనసుకు హత్తుకుని పని చేశారు. వాళ్లందరికీ థాంక్స్. నటీనటులందరికీ థాంక్స్. వాళ్లంతా నటించలేదు. జీవించారు. అందుకే ఇంత అద్భుతమైన విజయం వచ్చింది. అందుకే వంద అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి. మళ్లీ ఇలాంటి అద్భుతాలు జరుగుతాయో లేదో తెలిదు. అందుకే ఈ రోజు ఇలా ఈవెంట్ చేసుకుంటున్నాం. బలగం సినిమాను మీడియాకు చూపించాను. నా ఇరవై ఏళ్లలో ఎప్పుడూ చూడని రియాక్షన్ ఆ రోజు మీడియా వారిలో చూశాను. బాహుబలి, ఆర్ఆర్ఆర్ అనేవి అద్భుతాలు. పెద్ద బడ్జెట్‌లతో రాజమౌళి తెరకెక్కించాడు. ప్రపంచ వ్యాప్తంగా పేరు వచ్చింది. కానీ ఈ బలగం చిన్న ఊర్లో నేటివిటీతో తీశాం. ఈ సినిమాకు అంతర్జాతీయంగా వంద అవార్డులు వచ్చాయి. ఫ్యామిలీ సినిమాలు ఆడతాయా? అని అందరూ అనుకుంటూ ఉంటారు. సామజవరగమన, బేబీ వంటివి హిట్ అయ్యాయి. చిన్న సినిమాలు ఆడతాయనే నమ్మకం వచ్చింది. కొత్త ఊపిరి వచ్చినట్టు అయింది. మా పిల్లలకు ఇది మొదటి సినిమా. మేం ఎంతో కష్టపడి జర్నీ చేసి వచ్చి హిట్లు కొట్టాం. కానీ వాళ్లు మొదటి సినిమాతో హిట్ కొట్టారు. వంద అంతర్జాతీయ అవార్డులు సాధించారు. అది చాలా గ్రేట్. మాకు ఇంత వరకు ఒక్క ఇంటర్నేషనల్ అవార్డు కూడా రాలేదు. ఇలాంటి మంచి సినిమా మళ్లీ తీస్తారో లేదో అని మొదటి రోజే చెప్పాను. ఇదొక అద్భుతమైన సినిమా అని మొదటి రోజే అర్థమైంది. మళ్లీ ఇలాంటి గొప్ప చిత్రాలు తీయాలి. ప్రయత్నం చేస్తూనే ఉండాలి. జబర్దస్త్ షోలో కామెడీ చేసుకునేవాడికి డైరెక్షన్ చాన్స్ ఇచ్చి ఇంత మంచి సినిమా తీశారా? అని అడిగేవాళ్లు. ఈ సినిమాలో నెగెటివిటీ యాంగిల్‌ను ఎక్కడా చూపించలేదు. మానవసంబంధాలను పట్టుకుని ఈ సినిమాను తీశాడు వేణు. గొడవలు లేని కుటుంబం ఉండదు. కానీ మానవసంబంధాలు ఎంత గొప్పవో కాకి రూపంలో చెప్పడమే వేణు సక్సెస్. ఫ్యామిలీ సినిమాలంటే దిల్ రాజు బ్యానర్ నుంచి వస్తాయని తెలుసు. మా పిల్లలకు కూడా ఇంత మంచి సినిమా ఇచ్చిన వేణుకి థాంక్స్. మీ అందరి మీద ఇప్పుడు చాలా పెద్ద బాధ్యత ఉంది. బలగం అయిపోయింది. మరో బలగం లాంటి సినిమా తీయాలి. కష్టపడితేనే ఇలాంటి సినిమాలు వస్తాయి. వేణు, హన్షిత, హర్షిత్‌లకు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

వేణు యెల్దండి మాట్లాడుతూ.. ‘మూలాల్లోంచి రాసుకున్న కథ, అంతే సహజంగా తీయాలని అనుకున్నాను. అందుకే ప్రపంచంలో ఉన్న సినిమాలన్నీ చూశాను. అవార్డులు వచ్చిన సినిమాలు చూశాను. కానీ నా సినిమాకే వంద అవార్డులు వచ్చాయి. బలగం సినిమాకు మొదటి హీరో దిల్ రాజు. ఆయన నమ్మడం వల్లే ఈ సినిమా స్టార్ట్ అయింది. నా దృష్టిలో ఆయనే హీరో. చిన్న సినిమాను నమ్మి పెద్ద ఎత్తుకు తీసుకెళ్లారు. శిరీష్ గారు, హన్షిత, హర్షిత్ గార్లకు థాంక్స్. సినిమా రిలీజై నాలుగు నెలలు అవుతున్నా కూడా హ్యాంగ్ అవుట్ పోవడం లేదు. ఏదో ఒక ఈవెంట్ చేస్తూనే ఉన్నాం. సినిమాకు సపోర్ట్ చేసిన మీడియాకు థాంక్స్. నా నటీనటులందరికీ థాంక్స్. ప్రారంభంలో తెలంగాణ సినిమా అని అంతా ప్రచారం చేశారు. కానీ ఇది తెలుగు సినిమా. అమెరికా, రాయలసీమ ఇలా అందరూ ఆదరించారు. సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు నా ధన్యవాదాలు. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.