ప్రస్థుతం టాలీవుడ్లో ఊపుమీదున్న నిర్మాతల జాబితా తయారుచేస్తే మొదటి వరుసలో తప్పక ఉండే నిర్మాత బెల్లంకొండ సురేశ్.. అప్పుడెప్పుడో నందమూరి బాలకృష్ణతో భారీ సినిమా నిర్మించి తనపేరు తెలుగు సినిమా వారికి సుపరిచితం చేసుకున్నాడు. ఆ తరువాత అడపాదడపా చిన్నా, చితకా సినిమాలు మధ్యమధ్యలో కొన్ని డబ్బింగ్ సినిమాలు సైతం చేసిన సురేశ్ ఉన్నట్టుండీ అగ్రనిర్మాతగా మారిపోయా డు. ఒకేసారి ఐదు నుండీ ఆరు భారీ సినిమాలు నిర్మిస్తూ ఇండస్ట్రీలో సంచలనంగా మారిపోయాడు. అంతేకాకుండా రెమ్యూనరేషన్ విషయాల్లో కూడా తన మార్కు సంచలనాలు సృష్టిస్తూ పోతున్నాడు. మొన్నటికి మొన్న లక్కీగాళ్ సమంతాకు రెండు చిత్రాలకు గాను ఓ ఖరీదైన ఫాంహౌస్ బహుమతిగా ఇవ్వడం, తరువాత తన కుమారుడిని హీరోగా పరిచయం చేస్తూ నిర్మిస్తున్న చిత్రానికి దర్శకత్వం వహించడానికి వినాయక్ కు ఏకంగా పదికోట్ల రెమ్యూనరేషన్ ముట్టచెప్పడం, ఆ తరువాత జూనియర్ ఎన్టీయార్ కు సింగిల్ పేమెంట్ లో ఏకంగా ఒకేసారి మొత్తం పేమెంట్ (దాదాపు 15 కోట్లని అంచనా) చేయడం.. ఇలా వరుసగా సంచలనాలు సృష్టిస్తూ వచ్చాడు. ఇప్పుడు మరోసారి అమలాపాల్ విషయంలోనూ దాదాపుగా ఇలాంటి పనే చేశాడు సురేశ్. అమలా అందగత్తే.. కానీ సక్సెస్ రేట్ పరంగా కాస్త వీక్.. అందునా కొత్తగా తెలుగులో సినిమాలు చేస్తోంది. అయితేనేం బెల్లంకొండ తాజాగా మంచు మనోజ్ తో చేయబోతున్న సినిమాకు ఏకంగా కోటి రూపాయలు రెమ్యూనరేషన్ ఆఫర్ చేయడం ఇప్పుడు నిజంగానే ఓ సంచలనమే. అయితే ఇదివరకు ఇలాగే ఎగిరెగిరి పడ్డ నిర్మాతలకు ఎలాంటి ఎదురు దెబ్బలు తగిలాయో గమనించుకుని బెల్లంకొండ సురేశ్ తన గురించి ఆలోచించడమే కాకుండా, సినిమా నిర్మాణ వ్యయాన్ని కూడా కంట్రోల్ లో పెట్టుకోవడం మంచిదని కొందరు నిర్మాతలు సలహా ఇస్తున్నారు.