అత్తారింటికి దారేది వసూళ్లను వంద కోట్ల వరకూ లాగడానికి చిత్రబృందం శక్తి వంచన లేకుండా కృషి చేస్తోంది. కాస్త డల్ అయిన ఈ సినిమాపై మళ్లీ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచడానికి చిత్ర బృందం తాజాగా ఈసినిమాలో అరు నిమిషాల నిడివి గల సన్నివేశాలను కలిపింది. అదీ.. ద్వితీయార్థంలో. ఈ సీన్లన్నీ బ్రహ్మానందం – పవన్లపైనే చిత్రీకరించినవి కావడం విశేషం. ఈ రోజు (బుధవారం) నుంచి కొత్త సీన్లు చూడొచ్చు. ”అత్తారింటికి దారేది విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. 50 రోజుల వైపు పరుగులు తీస్తోంది. ఇంతటి విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు చిరు కానుక ఇస్తున్నాం. కొత్త సన్నివేశాలను జోడించాం. ఆరు నిమిషాల నిడివి గల ఈ సన్నివేశం ప్రేక్షకుల్ని మరింత ఆకట్టుకొంటుంది`” అని చిత్ర నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ చెబుతున్నారు.