అనుకొన్నట్టే జరిగింది. సీమాంధ్రలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ చేసిన అన్యాయానికి ప్రజలు గట్టిగానే బుద్ది చెప్పారు. గెలుపుపై కాంగ్రెస్కీ ఆశల్లేవు. కానీ ఇంతటి పరాభవాన్ని మాత్రం ఊహించలేకపోయింది. చిరంజీవి గ్లామర్ తమకు పనికొస్తుందని, కనీసం గౌరవ ప్రదంగానైనా ఓడిపోతామని భావించింది కాంగ్రెస్. అందుకే చిరుని ప్రచార సారధిగా నియమించింది. చిరు కూడా తన బాధ్యత సక్రమంగానే నిర్వర్తించారు. ఊరూరా, వాడవాడలా తిరిగారు. బస్ యాత్ర చేశారు. కానీ.. ఫలితం మాత్రం శూన్యం. చిరు షో అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అసలు బోణీనే కొట్టలేదు. దాదాపుగా అన్నీ చోట్లా మూడో స్థానమే. కొన్ని చోట్ల డిపాజిట్లు కూడా దక్కని వైనం కనిపిస్తోంది. మరోవైపు చిరు తమ్ముడు పవన్ కల్యాణ్ మాత్రం విజృంభించేశాడు. కాంగ్రెస్ హఠావో – దేశ్ బచావో నినాదం బాగా పనిచేసింది. దాంతో సీమాంధ్రలో టీడీపీ అనుకొన్నదానికంటే ఎక్కువ స్థానాలు కైవసం చేసుకోగలిగింది. పలితాల సరళి తరవాత మీడియాతో పవన్ ఉత్సాహంగా మాట్లాడాడు. కానీ అన్నయ్య చిరంజీవి అడ్రస్సే లేదు.