రజినీకి బీజేపీ గాలం

rajiniసూపర్‌స్టార్ రజనీ కాంత్ మద్దతు కోసం భారతీయ జనతా పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. రజనీ మద్దతు కోసం తమిళనాడులో బీజేపీ ముఖ్య నేతలు పావులు కదుపుతున్నారు. తాజాగా జాతీయ కార్యదర్శి మురళిధరరావ్ అధ్యక్షతన తమిళనాడు భారతీయ లోక్‌సభ ఎన్నికల కార్యాచరణ సంఘం సమావేశం తిరుచ్చిలో జరిగింది. ఈ సమావేశానిలో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు పొన్ రాధాకృష్ణన్, ఇల.గణేశన్, తమిళచ్చి సౌందరరాజన్ తదితరులు పాల్గొన్నారు.

సమావేశం అనంతరం పొన్‌రాధాకృష్ణ విలేకరులతో మాట్లాడారు. తమిళనాడులో ఎమ్.డి.ఎమ్.కె.తో పొత్తు పెట్టుకునే విషయమై చర్చలు జరుగుతున్నయని, అలాగే డి.ఎమ్.డి.కెతో కూడా సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. అదే విధంగా నటుడు రజనీకాంత్ మద్దతు కోరనున్నట్లు పొన్‌రాధాకృష్ణన్ స్పష్టం చేశారు.

అత్యంత అభిమానగణం, భారీ ప్రజాదరణ గల రజనీకాంత్‌ మద్దతు భారతీయ జనతా పార్టీ కి లభిస్తే తమిళనాడులో పార్టీ క్రేజ్ కు తిరుగుండదని అప్పుడే రాజకీయ విశ్లేషణలు మొదలయ్యాయి. అయితే ఈ విషయమై రజనీ తన అభిప్రాయాన్ని చెప్పాల్సివుంది.