సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చీకటి ఒప్పందాలు బయటపడ్డాయి. మాజీ డీజీపీ దినేష్ రెడ్డి సీఎంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు దినేష్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. సీఎం తమ్ముడు సంతోష్ రెడ్డి భూ కబ్జాలను అడ్డుకోవడం వల్లే తనను డీజీపీ పదవి నుంచి తొలగించారని ఆరోపించారు. అంతేకాకుండా.. తెలంగాణ వస్తే నక్సల్ సమస్య పెరిగే అవకాశం వుందని మీడియాతో చెప్పాలని ఒత్తిడి తెచ్చేవారని ఆయన తెలిపారు. సమైక్య వాదుల సభలకు అనుమతి ఇవ్వాలని కూడా ఆదేశించేవారని పేర్కొన్నారు. గచ్చిబౌలిలో న్యాయవాదుల సదస్సుకు, ఎల్బీ స్టేడియంలో ఏపీ ఎన్జీవోల సభల అనుమతిపై తనపై ఒత్తిడి తెచ్చేవారని దినేష్ రెడ్డి ఆరోపించారు. తాజాగా, సీఎంపై దినేష్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు చూస్తుంటే.. సమైక్య ఉద్యమానికి సీఎం నాయకత్వం వహిస్తున్నాడని తెలంగాణ వాదులు చేస్తున్న ఆరోపణలు నిజమయ్యేలా వున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి మాజీ డీజీపీ వ్యాఖ్యలపై సీఎం ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.