అసెంబ్లీ రద్దు చేస్తే బిల్లు ప్రసక్తేరాదు: టీజీ

TG-Venkatesh-addressing-Media-at-CLP-2రాష్ట్ర మంత్రి టీ.జీ.వెంకటేష్ నివాసంలో ఆదివారం ఉదయం సీమాంధ్రకు చెందిన మంత్రులు సమావేశమైయ్యారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఏపీఎన్జీవోల సంఘం శనివారం హైదరాబాద్లో నిర్వహించిన సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు వచ్చిన అపూర్వ స్పందనపై వారు ఈ సందర్భంగా చర్చించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు చేపట్టవలసిన విధి విధానలపై వారి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం.

సమావేశం అనంతరం టీ.జీ.వెంకటేష్ మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ బిల్లు వీగిపోయేలా చేసేందుకు ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. ఈమేరకు రాజ్యాంగ నిపుణులను సంప్రదిస్తున్నామని తెలిపారు. తమ రాజీనామాలు ఆమోదింపజేసుకుంటామని, తద్వారా అసెంబ్లీ రద్దయితే బిల్లు ప్రస్తావనే ఉండదని మంత్రి చెప్పుకొచ్చారు. అధిష్ఠానాన్ని ఒప్పించే సత్తా తమకుందని, కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం మెండుగా ఉంటుందని, ఇతర పార్టీల్లో అది కనిపించదని టీజీ పేర్కొన్నారు.