రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావుపై సమైక్యవాదులు చెప్పులతో దాడి చేయడాన్ని మంత్రి శ్రీధర్ బాబు తీవ్రంగా ఖండించారు. ఇలాంటి దాడులతో సమస్య పరిష్కారం కాదని హితవు పలికారు. పైగా సమస్య మరింత జటిల మవుతుందని అభిప్రాయపడ్డారు. ఏదేమైనా అధిష్ఠానం తీసుకున్న రాష్ట్ర విభజన నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలని శ్రీధర్ బాబు సూచించారు.
మరో వైపు ఇదే అంశం పై గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు మాట్లాడుతూ.. వీహెచ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఆయన అలా మాట్లాడడం వల్లే దాడి జరిగి ఉండొచ్చని రాయపాటి అన్నారు. గుంటూరులో సమైక్యాంధ్ర ర్యాలీలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, సీమాంధ్ర ప్రాంతంలో నిరసన తెలపాలని తామెవరకీ చెప్పలేదన్నారు. ప్రజలే స్వచ్ఛందంగా చేస్తున్న ఉద్యమం ఇదని, దీని వెనుక నేతలెవరూ లేరని స్పష్టం చేశారు.