సమైక్యాన్ని సాధిస్తాం

Ashok babuరాష్ట్రాన్ని సమైక్యంగానే వుంచాలని డిమాండ్ చేస్తూ.. ఏపీ ఎన్జీవోలు తలపెట్టిన నిరవధిక సమ్మె మొదటి రోజు విజయవంతమైందని ఏపీ ఎన్జీవోల అధ్యక్షుడు అశోక్ బాబు వెల్లడించారు. సమైక్య రాష్ట్రాన్ని సాధిస్తామనే విశ్వాసం మాకుందని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సమ్మెలో దాదాపు నాలుగు లక్షల మంది ఉద్యోగులు పాల్గొన్నారని, సీమాంధ్రలో పరిపాలన పూర్తిగా స్తంభించిందని అశోక్ అన్నారు. రాజధాని హైదరాబాద్ లో శాంతియుతంగా చేస్తున్న సమ్మెకు తెలంగాణ ఉద్యోగులు సహకరించాలని ఆయన కోరారు. విభజన కాకముందే శాంతియుతంగా చేస్తున్న సమ్మెకు ఆటంకాలు కలుగజేస్తే.. రాష్ట్ర విడిపోతే పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. ప్రజల ఆకాంక్ష మేరకు ప్రజాప్రతినిధులు ఉద్యమంలో పాల్గొనాలని ఆయన కోరారు. అలాగే, ఎలాంటి బెదిరింపులు, ఒత్తిళ్లకు లొంగకుండా సమ్మె కొనసాగిస్తామని అశోక్ స్పష్టం చేశారు.