కావూరి స్వాగతయాత్రలో అపశృతి !

kavuriకేంద్రమంత్రి కావూరి సాంబశివరావు స్వాగత యాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. కేంద్ర మంత్రి పదవి చేపట్టిన తర్వాత తొలిసారిగా కావూరి తన నియోజకవర్గానికి వస్తున్న నేపథ్యంలో.. ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు కార్యకర్తలు పోటెత్తారు. విజయవాడ సమీపంలోని గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న మంత్రికి అభిమానులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. గన్నవరం నుంచి వాహనాలలో ఏలూరుకు వస్తుండగా, కార్యకర్తలు ఆనందోత్సాలతో బాణసంచా కాల్చుతూ కాన్వాయ్ గా అనుసరించారు. ఇంతలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున పేలుళ్లు జరిగాయి. అయితే, నిప్పురవ్వలు వచ్చి బాణసంచా సరుకున్న ఆటోలో పడడంతో పేలుళ్లు జరిగాయని సమాచారం. దీంతో వాహన డ్రైవర్ సజీవ దహనం కాగా మరో ఇద్దరు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. కాగా, గాయపడినవారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.