ప్రిన్స్, డింపుల్ జంటగా నటించిన చిత్రం రొమాన్స్. డార్లింగ్ స్వామి దర్శకత్వం వహించారు. గుడ్ సినిమా గ్రూప్, మారుతి మీడియా హౌస్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలోని గీతాలు శనివారం రాత్రి హైదరాబాద్లో విడుదలయ్యాయి. తొలి సీడీని అల్లు అర్జున్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ “చిన్న సినిమా పెద్ద సినిమా అనేవి లేవు. నాకు తెలిసింది మంచి సినిమా ఒక్కటే. మనం ఒకర్ని స్టార్లను చేస్తే స్టార్లు అయిపోరు. వారిలో ప్రతిభ ఉంటేనే అవుతారు. మారుతి స్నేహితుడి కంటే దర్శకుడిగా నచ్చేశాడు. మారుతి ఇచ్చిన స్ఫూర్తితోనే ఇద్దరమ్మాయిలతో సినిమా డిజిటల్ ఫార్మెట్ లో తీశాం. స్వామి నాకు మంచి మిత్రుడు. పాటలు, ట్రైలర్లు అన్నీ బాగున్నాయి. తప్పకుండా ఈ సినిమా మంచి విజయం అందుకోవాలి“ అని ఆకాంక్షించారు. ”నేను విజయం సాధిస్తే – ఒక్కడినే పైకొస్తా. అదే నా సంస్థ విజయం సాధిస్తే అందరూ బాగు పడతారు. మా సంస్థ నుంచి నెలకో చిన్న సినిమా అయినా రావాలి…” అన్నారు మారుతి. ఈ కార్యక్రమంలో చిత్రబృందంతో పాటు వీరభద్రమ్, బి.జయ, రిచా గంగోపాధ్యాయ, బెల్లంకొండ సురేష్ తదితరులు పాల్గొన్నారు.