కేదార్ నాథ్ లో గల్లంతైన బావాజీపేట బాధిత కుటుంబ సభ్యులను కేంద్రమంత్రి చిరంజీవి ఈ రోజు (ఆదివారం) పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉత్తరాఖండ్లో వరదలు దురదృష్టకరమైన సంఘటనగా అభివర్ణించారు. ఈ ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించేందుకు కేంద్రం కసరత్తు చేస్తుందని పేర్కొన్నారు. సహాయక చర్యలు పూర్తిస్థాయిలో అందకపోవడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొండల్లోనూ, అడవుల్లోనూ యాత్ర జరగడంతో ఎవరు ఎక్కడ చిక్కుకుపోయారనే విషయంపై అధికారులు ఓ స్పష్టతకు రాలేకపోతున్నారు’ అని చిరు అన్నారు. బాదితులకు ఎంపీ నిధుల నుంచి రూ.కోటి విరాళంగా ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. దేశంలోని ప్రజలందరూ తోచినంతలో సహాయం చేయాలని సూచించారు. పర్యాటక సిబ్బంది ఒక్కరోజు వేతనాన్ని విరాళంగా సమర్పించారని తెలిపారు. చిరంజీవి వెంట పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ,స్థానిక ఎమ్మెలేలతోపాటు పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు.