అమ్మ తలచుకుంటే…

jana reddyకాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తలచుకుంటే.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి పేర్కొన్నారు. జానా ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ..  ఎప్పటికైనా తెలంగాణ రావడం ఖాయమని, అయితే, కాంగ్రెస్ హయాంలోనే తెలంగాణ వచ్చేందుకు మేము కృషిచేస్తున్నామని తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ కాంగ్రెస్ నేతల సంతకాలు తీసుకున్నామని… సంతకాలు పెట్టనివారి పేర్లు ఈనెల 30వ తేదీన జరిగే నిజాం కళాశాల సభలో వెల్లడిస్తామని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు రాష్ట్ర జనాభా మూడున్నర కోట్లు ఉందని, ఒక్క తెలంగాణ జనాభానే  ఇప్పుడు మూడున్నర కోట్లు ఉన్నారని జానారెడ్డి అన్నారు. తెలంగాణ ఇచ్చి కాంగ్రెస్ ప్రతిష్టను పెంచమని హైకమాండ్ ను కోరినట్లు ఆయన తెలిపారు. కాగా, మండల వ్యవస్థను అందరూ వ్యతిరేకించినా.. ఎన్టీఆర్ దానిని అమలు చేశారని, ఇప్పుడు అందరూ దానిని ఆస్వాదిస్తున్నారని జానారెడ్డి గుర్తుచేశారు.