‘దేశం’ కు కడియం రాజీనామా

kadiyamతెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంతానికి చెందిన సీనియర్ నాయకుడు కడియంశ్రీహరి పార్టీకి, తన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. గత రెండు రోజులుగా తన నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించిన అనంతరం ఈరోజు ఉదయం ఆయన రాజీనామ నిర్ణయం గైకొన్నారు. గతకొంత కాలంగా తెదేపాలో ఇమడలేకపోతున్న శ్రీహరి తన అసంతృప్తిని బహిరంగంగానే పలు పర్యాయాలు వ్యక్తం చేశారు. కొద్దిరోజుల క్రితమే పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో సమావేశమైన కడియం తన బాధను ఆయన ముందు వెళ్లగక్కారు. త్వరలోనే అన్ని సర్దుకుంటాయని ఎటువంటి అసంతృప్తికిలోను కావద్దని బాబు శ్రీహరికి హామిఇచ్చారు. కొద్దిరోజులుగా మౌనంగా ఉన్న శ్రీహరి హఠాత్తుగా ఈ రాజీనామా నిర్ణయం గైకొనడం పార్టీవర్గాలను దిగ్ద్రాంతికి గురిచేసింది. ఆయన త్వరలోనే టీఆర్ ఎస్ పార్టీలో చేరతారని ఆ పార్టీ అభ్యర్థిగా స్టేషన్ గణ్ పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని, ఈ మేరకు తెరాస అధినేత చంద్రశేఖర్ రావుతో కూడా ఆయన చర్చలు జరిపారని తెలిసింది. ఇప్పటికే ఉత్తరాంధ్ర ప్రాంతంలో దాడి వీరభద్ర రావును పోగొట్టుకున్న తెదేపా తాజాగా తెలంగాణలో కడియం శ్రీహరి నిష్క్రమణతో ఏర్పడిన లోటును ఎలా భర్తీ చేసుకుంటుందో చూడాలి.