బాబుతో కడియం భేటీ !

babu-kadiyamతెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు తన “వస్తున్నా.. మీకోసం” పాదయాత్ర ముగిసిన అనంతరం పార్టీ అంతర్గత సమస్యలను చక్కదిద్దే పనిలో పడ్డారు. గతకొద్దికాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ.. అలకబూనిన పార్టీ సీనియర్ నేత, పోలిట్ బ్యూరో సభ్యుడు కడియం శ్రీహరి పార్టీ అధినేతతో ఈరోజు సమావేశమయ్యారు. కాగా, కొద్దికాలంగా కడియం తెరాసలో చేరబోతున్నట్లు వార్తలొస్తున్న నేపథ్యంలో.. వీరి భేటీ ప్రధాన్యతను సంతరించుకుంది.

బాబు నివాసంలో జరిగిన ఈ సమావేశంలో ప్రధానంగా తెలంగాణ విషయంలో పార్టీ ఫోరంలో పొడసూపిన భేదాభిప్రాయలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా కడియం సొంత జిల్లా వరంగల్ నుంచి తెరాస శ్రేణులు టీడీపీలో చేరబోతున్నట్లు సాగుతోన్న ప్రచారంపై కూడా అధినేతతో చర్చకు వచ్చినట్లు సమాచారం. తెదేపాలో చిన్న చిన్న సమస్యలతో అలకబూనిన కడియం లాంటి నేతలతో అధినేత ఇలా సమావేశమై సమస్యలు పరిష్కరిస్తే.. రానున్న ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేయడం మరింత సులభమవుతుందని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.