సామాన్య ప్రేక్షకుడికి అత్యంత సమీపంలో ఉన్న వినోద సాధనం సినిమా..! రెండున్నర గంటల హాయైన వినోదాన్ని అతి చవకగా అందుకోగలగుతున్నాడు. అయితే ఇది నిన్నటి మాట మాత్రమే. నేటి ప్రభుత్వ నిర్ణయంతో టికెట్టు రేటుకు కూడా రెక్కలొచ్చాయి. సినిమా టికెట్టు ధరలు విరివిగా పెరిగాయి. ఏసీ థియేటర్ లో సినిమా చూడడం ఇప్పుడు కాస్త ఖరీదైన వ్యవహారమే. ఎందుకంటే నిన్నటి వరకూ రూ55గా ఉన్న బాల్కనీ ధర కొత్త జీవోతో రూ.75 అయ్యింది. రూ.10 టికెట్టు ధరలో ఎలాంటి మార్పూ లేదు. 2, 3 తరగతలు ధరలు మాత్రం స్పల్పంగా పెరుగుతాయి. పార్కింగ్ రేట్లు కూడా థియేటర్ల యాజమాన్యం భారీగా పెంచేశాయి. థియేటర్లో టీ, శీతలపానియాలు, ఆహార పదార్థాల రేట్లు ఎప్పుడూ డబుల్ గానే ఉంటాయి. ఇప్పుడు ఆదివారం సాయంత్రం సరదాగా ఇంటిల్లిపాదీ సినిమా చూడాలంటే.. ఖర్చు తడిసి మోపెడవ్వడం ఖాయం. చిన్న సినిమాలకు అంతంత మాత్రమే వచ్చే ప్రేక్షకులు.. ఇప్పుడు మరింత దూరమయ్యే ప్రమాదం ఉంది. ఈ నిర్ణయాలన్నీ అగ్ర నిర్మాతలు, అగ్ర కథానాయకుల సౌలభ్యం కోసమే అనేది నిర్వివాద అంశం. తొలి వారంలో భారీగా సొమ్ము చేసుకోవాలంటే టికెట్టు రేటు పెంచక తప్పదని వాళ్లు కొంతకాలంగా ప్రభుత్వాన్ని కోరుకొంటున్నారు. వారి మెర ప్రభుత్వం ఆలకించి…. రేట్లు పెంచేసింది. పెద్ద నిర్మాతలకు లాభం తెచ్చిపెట్టిన ఈ నిర్ణయం పట్ల చిన్న నిర్మాతలు ధ్వజం ఎత్తుతున్నారు.