కరోనా వైరస్ ఖంగుతినిపిస్తుంది..ఈ పేరు వింటే జనాలు వణికిపోతున్నారు. చైనాలో రోజురోజుకు కరోనా వైరస్ విజృంభిస్తోంది. చైనాలో కరోనా వైరస్ బారినపడి ఇప్పటి వరకు 560 మంది మృతి చెందారు. ఇప్పుడు ఈ వైరస్ కారణంగా పలు సినిమా షెడ్యూళ్లు కూడా రద్దు అవుతున్నాయి. తాజాగా నాగార్జున నటిస్తున్న చిత్రానికి కరోనా వైరస్ ఇబ్బంది గా మారింది.
నాగార్జున ప్రధాన పాత్రలో వైల్డ్ డాగ్ అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో థాయ్లాండ్లో తర్వాతి షెడ్యూల్ జరిగేలా ప్లాన్ చేసింది. అయితే థాయిలాండ్ దేశంలో పాతిక వరకు కరోనా కేసులు నమోదుకావడం వలన దర్శక నిర్మాతలు ఆ షెడ్యూల్ని క్యాన్సిల్ చేశారు. కరోనా తగ్గినా తర్వాతే ఎక్కడ షూటింగ్ చేద్దామని చిత్ర యూనిట్ డిసైడ్ అయ్యారు. ఈ చిత్రంలో నాగార్జున ఎన్ఐఏ అధికారి విజయ్ వర్మ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో సయామీ ఖేర్, దియా మీర్జా ముఖ్యపాత్రల్లో నటిస్తున్నట్టు సమాచారం.