రౌడీబేబి జోరు మామూలుగా లేదుగా…

‘ఛలో’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయిన ముద్దుగుమ్మ రష్మిక మందన్నా ‘గీతా గోవిందం’ చిత్రంతో ఒక్కసారిగా మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. దాంతో అప్పటి నుండి ఈ అమ్మడు క్రేజీగా మారిపోయింది. తర్వాత ‘దేవదాస్‌’, ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రాలు పరాజయం పాలైనా కూడా ఈ అమ్మడి క్రేజ్‌ ఏ మాత్రం తగ్గలేదు. స్టార్‌ హీరోలు కూడా రష్మికతో రొమాన్స్‌ చేయడానికి ఇష్ట పడుతున్నారు. ఈ అమ్మడు సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు సరసన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో నటిస్తోంది. అల్లు అర్జున్‌, సుకుమార్‌ చిత్రంలో కూడా ఈ అమ్మడే హీరోయిన్‌గా ఎంపికయింది.

‘ఛలో’ దర్శకుడు  వెంకీ కుడుముల నితిన్‌ హీరోగా తెరకెక్కించే ‘భీష్మ’ చిత్రంలో కూడా రొమాన్స్‌ చేయనుంది. తాజాగా నాగచైతన్యతో నటించేందుకు ఈ అమ్మడు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. చైతూ నటించనున్న ‘అదే నువ్వు అదే నేను’ చిత్రాన్ని దిల్‌రాజ్‌ నిర్మిస్తుండగా కథానాయికగా రష్మిక ఎంపికయింది. దాంతో చేతిలో ఇన్ని సినిమాలను పెట్టుకుని స్టార్‌ హీరోయిన్‌గా మారనుంది. ఈ అమ్మడికి అవకాశాలన్ని సక్సెస్‌ అయితే స్టార్‌ హీరోయిన్‌గా వెలుగు వెలగడం ఖాయం. మొత్తానికి చేతినిండా సినిమాలతో రౌడీబేబి జోరు మామూలుగా లేదు.