ప్యాక్షన్‌లో ‘సరిలేరు నీకెవ్వరు’

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు 26వ చిత్రం సరిలేరు నీకెవ్వరు చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుతున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేసే ఉద్దేశ్యంలో ఉన్న దర్శకుడు అనీల్‌ రావిపూడి ప్రస్తుతం కర్నూలు కొండారెడ్డి బురుజు ఏరియాలో చిత్రీకరణ చేస్తున్నాడు. గత నెలలో 10 రోజుల పాటు కర్నూలులో చిత్రీకరణ జరిపారు. ఇప్పుడు మరో రెండు వారాల పాటు అక్కడ చిత్రీకరణ జరిపేందుకు వెళ్లారు. అక్కడ కీలక సన్నివేశాలు జరుపుతున్న నేపథ్యంలో ఇది ఫ్యాక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమానా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

సరిలేరు నీకెవ్వరు చిత్రంలో మహేష్‌బాబు ఆర్మీ మేజర్‌ పాత్రలో కనిపించబోతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాలున్న ఈ చిత్రంలో ఫ్యాక్షన్‌ నేపథ్యం కూడా ఉండబోతుందని తాజాగా సినీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్‌ ద్వారా తెలుస్తోంది. ఫ్యాక్షన్‌ సినిమాలంటే ఎక్కువగా కర్నూలులోని కొండారెడ్డి బురుజు వద్దే తీస్తారు. గతంలో మహేష్‌బాబు ఒక్కడు సినిమాను అక్కడే తీశారు. ఇప్పుడు ఈ చిత్రంకు కూడా మెజార్టీ పార్ట్‌ అక్కడ షూటింగ్‌ జరుపుతున్నారు. దాంతో సినిమా గురించి రకరకాల పుకార్లు పుట్టుకు వచ్చి సినిమాపై అంచనాలు పెంచేస్తోంది.